‘Bharat Dojo Yatra’: మరో యాత్ర చేపట్టేందుకు సిద్ధమైన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి యాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి యాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు. గతేడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు భారత్ జోడో న్యాయ యాత్ర చేసిన రాహుల్..త్వరలో భారత్ డోజో యాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. రాహుల్ గాంధీ చిన్న పిల్లలకు జియు జిట్సు, మార్షల్ ఆర్ట్స్ నేర్పించేందుకు యాత్ర చేపడతానని అన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రకటించారు. మార్షల్ ఆర్ట్స్లో శిక్షణనిచ్చే కేంద్రాలను డోజో అని పిలుస్తారు. ఈ సందర్భంగా..‘గత ఏడాది భారత్ జోడో న్యాయ యాత్ర పేరిట వేల కిలోమీటర్లు ప్రయాణించా.ఆ యాత్రలో ఫిట్గా ఉండేందుకు ప్రతి రోజు సాయంత్రం మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకున్నారు. యాత్రలో భాగంగా నేను బస చేసే ప్రాంతంలో యువ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థుల్ని కలిశాను’ అని రాహుల్ గాంధీ ట్వీట్లో పేర్కొన్నారు. న్యాయ్ యాత్రలో ఆత్మరక్షణ కోసం పిల్లలకు జియు-జిట్సు కళను నేర్పుతున్న వీడియోను పోస్ట్ చేశారు.