Kejriwal: అధికార బంగ్లాను ఖాళీ చేయనున్న కేజ్రీవాల్

ఆప్‌ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) వారంరోజుల్లోగా అధికార నివాసాన్ని ఖాళీ చేయనున్నారు.

Update: 2024-09-18 08:22 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఆప్‌ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) వారంరోజుల్లోగా అధికార నివాసాన్ని ఖాళీ చేయనున్నారు. ప్రభుత్వ సౌకర్యాలన్నింటినీ వదులుకుంటారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ (Sanjay Singh) బుధవారం తెలిపారు. ‘‘వారం రోజుల్లోగా కేజ్రీవాల్‌ అధికార నివాసాన్ని ఖాళీ చేయనున్నారు. అంతేకాకుండా.. ప్రభుత్వం కల్పించిన అన్నిరకాల వసతులను వదులుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు. మేము అతని భద్రత గురించి ఆందోళన చెందుతున్నాము. ఇప్పుడు ఉన్న ఇల్లు భద్రతా దృష్ట్యా బాగుంది. కానీ, అతను దానిని ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నారు. అతను ఢిల్లీ ప్రజలతో కలిసి జీవించాలనుకుంటున్నారు.’’ అని సంజయ్‌సింగ్‌ పేర్కొన్నారు.

బీజేపీపై విమర్శలు

కేంద్రంలోని బీజేపీపై సంజయ్ సింగ్ విమర్శలు గుప్పించారు. అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాపై ఢిల్లీ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం ఏముందని వారు ప్రశ్నిస్తున్నారని అన్నారు. కేజ్రీవాల్‌ను అవినీతిపరుడని, ఆయన నిజాయితీని ప్రశ్నిస్తూ గత రెండేళ్లుగా బీజేపీ పరువు తీసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. బెయిల్ పొందడం దాదాపు అసాధ్యమైన సందర్భంలో కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిందన్నారు. అయితే, ఆయన సీఎం పదవికి ఎందుకు రాజీనామా చేస్తారు? అని అన్నారు. కాగా.. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కాంకు సంబంధించిన మనీలాండరింగ్‌ ఆరోపణలపై సీఎం కేజ్రీవాల్‌ అరెస్టయ్యారు. జైలు నుంచి విడుదలైన ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో, అధికార నివాసాన్ని ఖాళీ చేయనున్నారు. కొత్త నివాసం కోసం ఆయన కుటుంబసభ్యులు వెతుకుతున్నట్లు తెలుస్తోంది. కేజ్రీవాల్‌ భద్రతపై ఆప్‌ ఆందోళన వ్యక్తంచేస్తోంది.


Similar News