Uttar Pradesh CM: ఉత్తరప్రదేశ్ సర్కారు తీరుపై కాంగ్రెస్ విమర్శలు

ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్‌(Yogi Adityanath) తీరుపై కాంగ్రెస్ మండిపడింది.

Update: 2024-10-28 09:34 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్‌(Yogi Adityanath) తీరుపై కాంగ్రెస్ మండిపడింది. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్‌ విద్యార్థులకు రూ.300 చెక్కులు పంపిణీ చేయడంపై కాంగ్రెస్ నిప్పులు చెరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని సంపూర్ణానంద సంస్కృత యూనివర్సిటీలో విద్యార్థులకు రూ.300 నుంచి రూ.900 ఉపకార వేతనాలను చెక్కురూపంలో పంపిణీ చేశారు. కాగా రూ.300లను అందజేసేందుకు భారీ చెక్కు నమూనాను వాడిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. దీనిపైనే ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రూ.300లతో విద్యార్థులకు ఏం వస్తుందంటూ హస్తం పార్టీ ప్రశ్నించింది. కాంగ్రెస్ (Congress) నేత షమా మహ్మద్‌ స్పందిస్తూ వాటిని ప్రింటింగ్‌ చేయడానికి అంతకంటే ఎక్కువ ఖర్చు చేసి ఉండొచ్చని అన్నారు. ఇలాంటి పనులు కేవలం బీజేపీ ప్రభుత్వానికే సాధ్యమని చురకలు అంటించారు. స్టూడెంట్లను యోగి సర్కారు పబ్లిసిటీ కోసం వాడుకుంటుందని విమర్శించారు.

యోగి ఏమన్నారంటే?

మరోవైపు, చెక్కుల పంపిణీ తర్వాత యోగి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. యూపీలో రెసిడెన్షియల్ గురుకులాల తరహా సంస్కృత పాఠశాలలను పునరుద్ధరించాలని ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. యూపీలో దాదాపు 1.5 లక్షల మంది విద్యార్థులు సంస్కృతం నేర్చుకుంటున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ సంస్కృతిపై యువత మక్కువ పెంచుకుంటుందని పేర్కొన్నారు.


Similar News