మహేష్ కోసం భారీ సెట్.. జక్కన్న నెక్స్ట్ ప్లాన్ ఇదేనట

ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకుండానే ఇండస్ట్రీలో చాలా మంది దృష్టిని ఆకర్షించింది

Update: 2024-07-04 08:49 GMT

దిశ, సినిమా: ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా విజయం తర్వాత, లెజెండరీ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తన తదుపరి చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి పని చేయనున్నారు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకుండానే ఇండస్ట్రీలో చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మహేష్ బాబు ప్రత్యేక శిక్షణ తీసుకుని తన బాడీ మేకోవర్ ను పూర్తిగా మార్చుకున్నాడు. ఈ ప్రాజెక్ట్‌కి మూడేళ్ల వరకు డేట్స్ ఇచ్చాడు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా, ఈ సినిమాకి సంబందించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో ఈ సినిమా సెట్ వర్క్ ప్రారంభమైనట్లు తెలిసింది. ఒక్క సెట్ మాత్రమే కాకుండా.. అన్ని రకాల సెట్లను రాజమౌళి డిజైన్ చేయిస్తున్నాడని సమాచారం. వీటిలో ఆఫీస్ సెట్ కూడా ఉందని, చాలా వరకు చిత్రీకరణ అక్కడే జరుగుతుందని సినీ వర్గాల వారు చెబుతున్నారు.

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం సినిమాలో నటీనటులపై దృష్టి సారించాడు. దీనికి సంబంధించి, ఈ చిత్రంలో విలన్ పాత్రను పోషించడానికి మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్‌ను ఎంచుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. దీని గురించి ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.


Similar News