గొప్ప అనుభావాల ఇంద్రధనుస్సు

Terichina pustakam Book review

Update: 2024-09-01 19:00 GMT

జీలానీ భానూ రాసిన ‘అద్భుతమైన జ్ఞాపకాల పందిరి ‘తెరిచిన పుస్తకం’’ మెహక్ హైదరాబాదీ ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. ఈ గొప్ప అనుభావాల ఇంద్రధనుస్సుని నేషనల్ బుక్ ట్రస్ట్ అసిస్టెంట్ ఎడిటర్ డాక్టర్ పత్తిపాక మోహన్ ద్వారా అందుకున్నాను. మొదట ఆయనకు ధన్యవాదాలు. చిన్ననాటి జ్ఞాపకాలు శీర్షిక కింద ఎన్‌బీటీ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. ఇవి కేవలం జీలానీ భానూ వ్యక్తిగత అనుభావాలే కాదు. ఒక కాలంలో ఒక ప్రాంతంలో ఒక తరం గడిపిన జీవితాల చిత్రణ. ఇప్పటికీ చాలా మందికి తెలియని చాలా గొప్ప హైదరాబాదీ దక్కన్ సంస్కృతిని ఈ చిన్న పుస్తకం ఆవిష్కరించింది.

నిజానికి ఒక ప్రతిభావంతుడైన కవో రచయితో కళాకారుడో తన జీవిత చరిత్రని లేదా జ్ఞాపకాల్ని రాసినప్పుడు కేవలం స్వీయ అనుభవాలు లేదా సొంత బతుకు మాత్రమే రికార్డు కాదు. వాటితో పాటు ఆయా కాలాల సామాజిక సాంస్కృతిక రాజకీయ పరిస్థితులూ మన ముందుకు వస్తాయి. ఫలితంగా మనకు ఆయా దేశ కాల పరిస్థితులు కండ్ల ముందు కనిపిస్తాయి. భవిష్యత్తు తరాలకు మార్గ నిర్దేశనం కూడా చేస్తాయి. అందుకే “ప్రతి గొప్ప ఆత్మకథా అప్రకటిత సామాజిక సాంస్కృతిక రాజకీయ చరిత్ర”నే. వర్తమానంలో వాస్తవిక చరిత్రను పక్కదోవ పట్టిస్తున్నారు. కాలం గడిచిన కొద్దీ తమకనుకూలంగా వక్రభాష్యాలు చెబుతున్నారు. కొత్త వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో నిజాయితీగా రాసిన జీవిత చరిత్రలు వాస్తవ అవగాహనకు కొంత ఆధారాలవుతాయి. ఇవాళ రాయగలిగిన ప్రతి రచయితా, కవీ, కళాకారుడూ, మేధావీ తమ అనుభవాలను ఏదో రకంగా అక్షరబద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఆ పనిని జీలానీ భానూ రాసిన తెరిచిన పుస్తకం ప్రతిభావంతంగా చేసింది.

జ్ఞాపకాల తిజోరి

‘జ్ఞాపకాల మబ్బులు కమ్ముకుని చినుకు చినుకుగా వర్షిస్తున్నాయి. ఏనాడో గడిచిన కాలం. వెలుగులు విరజిమ్మే జ్ఞాపకాల కాంతులు. నవ్వులతో విరిసే అందమయిన ముఖాలు నాకు మాటలు నేర్పాయి. ముందుకు చాపిన ఆ చేతులు నన్ను మున్ముందుకు నడిపించాయి’ అంటూ జీలానీ భానూ తన జ్ఞాపకాల తిజోరీ తెరిచారు. మనముందు పరిచారు. ‘నా బాల్యం నన్నెప్పుడూ విడిచి పెట్టదు. చిన్నప్పుడు ఎంతో అమాయకంగా వుండేదాన్ని. ఎంత అమాయకత్వం అంటే- నా చుట్టూ కమ్ముకున్న చీకట్లూ వెలుగులూ కూడా నాకు తెలిసేవి కావు’ అన్న ఆమె తన జీవితంలో సాధించిన అనేక విషయాల్ని ఆలవోకగా చెప్పారు. ఒక ప్రవాహంలా సాగిందీ రచన. తమ ఇంట్లో అమలులో వున్న సనాతన సంప్రదాయాలు మొదలు అనేక అంశాల్ని ఆమె స్పృశించారు. గొప్ప రచయిత అయిన జీలానీ భానూ “ ఖాళీ పేపర్‌పై నేను ఏదయినా కథ రాయాలనుకున్నప్పుడు ,”నేను నేను కాదు- నేను మరో మనిషిని” అని నాకనిపిస్తుంది. నేనేమి రాశాను? ఎందుకు రాశాను? అని లోతుగా పరిశీలిస్తాను అన్నారు. నిజంగా ఎంత మంచి అభిప్రాయం. రాసేవాళ్లంతా అనుసరించాల్సిన దారి.

ముశాయిరాలతో ఎదిగిన బాల్యం

చిన్నప్పుడే తమ ఇంట్లో జరిగే ముశాయిరాలకు వచ్చే అప్పటి ప్రముఖ కవుల రచనలతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఫానీ బదాయునీ, జోష్ మలిహా బాదీ, జిగర్ మురాదా బాదీ, హాష్ బిలిగ్రామీ, ముఖ్డుం మొహియుద్దీన్, కైఫీ అజ్మీ, షకీల్ బదాయునీ, మజ్రూ సుల్తాన్ పూరి లాంటి ఎందరో గొప్ప కవులు వారి రచనల పరిచయం ఆమెను భిన్నంగా ఆలోచించడానికి ఉపయోగపడింది. చిన్నప్పటి నుండి రచనలు చేసిన ఆమె ‘లోకం’ పెళ్లి తర్వాత మరెంతో విస్తృతమైంది. భర్త అన్వర్ మో అజ్జం గొప్ప ఉర్దూ పండితుడూ పరిశోధకుడూ. ఆ క్రమంలో ఆమె ఇస్మత్ చుగ్తాయి, కృష్ణ చందర్, అమ్రితా ప్రీతం, ఫైజ్ అహ్మద్ ఫైజ్, అలీ సర్దార్ జాఫ్రీ తదితరులతో సాన్నిహిత్యం ఆమె సృజనకు ఎంతో దోహదపడింది. ఎన్నో గొప్ప అనుభవాల్ని మిగిల్చింది. ఆ అనుభవాల్ని ఈ చిన్న పుస్తకంలో నిక్షిప్తం చేశారు. ముఖ్యంగా తన చిన్ననాటి జ్ఞాపకాల్ని అందించిందీ పుస్తకం.

అవార్డులు తెచ్చిన అక్షరాలు

జీలానీ భానో 1936 జూలై 14న ఉత్తర్ ప్రదేశ్ లోని బదాయున్‌లో జన్మించారు. ఆమె తండ్రి హైరత్ బదాయుని ఉర్దూలో గొప్ప కవీ పండితుడూ. ఆమె తన చిన్ననాడే కథలు రాయడం ఆరంభించింది. ఆమె రాసిన మొదటి కత ‘ఏక్ నజర్ ఇదర్ భీ’ 1952లో అచ్చు అయింది. ఇప్పటికి తను 22 పుస్తకాలు వెలువరించారు. అందులో ‘రోష్ని కే మినార్’ లాంటి కథల పుస్తకాలూ, ‘అయివాన్ ఎ గజల్’ లాంటి నవలలు ఉన్నాయి. ఇంకా ఆమె తన జీవిత చరిత్ర “అఫ్సానే’, ఇతర ప్రసిద్ధ రచయితలతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల సంపుటిని వెలువరించారు. జీలానీ భానో రాసిన ‘నర్సయ్యా కీ బావ్డీ’ ఆధారంగా ప్రముఖ దర్శకుడు శ్యాం బెనెగల్ ‘వెల్ డన్ అబ్బా” సినిమాగా రూపొందించారు. ఆమెకు పద్మశ్రీ అవార్డుతో పాటు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, సోవియట్ లాండ్ నెహ్రూ పురస్కారం, హర్యానా ఉర్దూ అకాడమీ నుండి ఖ్వామీ హాలీ అవార్డ్, తెలంగాణా ప్రభుత్వం ఇచ్చే ముఖ్దుం అవార్డ్, హైదరాబాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్‌తోపాటు అనేక పురస్కారాలు పొందారు. అస్మిత లాంటి సంస్థలకు సేవలందించారు.

యువతలో చదివే ఆసక్తిని పెంపొందించే కృషిలో భాగంగా నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన ఈ పుస్తకం యువకులే కాదు పెద్దలూ చదవాలి. ఇక అనువాదం విషయానికి వస్తే చాలా సరళంగా సాగింది. మెహక్ హైదరాబాదీగా ప్రసిద్ధులైన పి.వి.సూర్యనారాయణ మూర్తి సీనియర్ జర్నలిస్టు, ఉర్దూ కవి, అనువాదకులు. ఆయనకు మనసారా నా అభినందనలు.

పుస్తకం : తెరిచిన పుస్తకం

రచయిత : జీలానీ భానూ

అనువాదం : మెహక్ హైదరాబాదీ

పేజీలు : 93 పేజీలు

వెల : రూ. 215

ప్రచురణ: నేషనల్ బుక్ ట్రస్ట్, హైదరాబాద్


సమీక్షకులు

-వారాల ఆనంద్

94405 01281

Tags:    

Similar News

ఎర్ర శిఖరం!
బుల్డోజరు