మానవత్వం మంట గలసింది
సభ్య సమాజం తల దించుకునేలా
ప్రాణాలు పోసే వైద్యురాలు
కర్కశ రాక్షస జాతి చేతుల్లో
బేలగా విల విలలాడుతూ
ప్రాణాలు కోల్పోయింది.
నర రూప రాక్షసుల వికృత క్రీడకు
మాన ప్రాణాలు కోల్పోయి..
మౌనంగా లోకాన్ని వీడిపోయింది.
మానవత్వాన్ని మరిచిన మృగాళ్ల
పైశాచిక ఆనందానికి బలైపోయింది.
ఓ వైద్య దేవత
కలకత్తా కాళీమాత చెంతన
అచేతన అయి అబలగా చేసిన
ఆర్తనాదం నాలుగు గోడల మధ్య
బందీ అయిపోయింది.
తను కన్న కలలు నాలుగు గోడల
మధ్య ఆవిరి అయిపోయినవి.
అమ్మా నాన్నల ఆశాజ్యోతి ఆరిపోయింది..
మృగాళ్ల వికటాట్టాహాసం
ముందు నిర్భయ చట్టాలు
నిర్వీర్యం అయిపోయినవి.
ప్రాణాలు పోసే దేవతలు
ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని
ప్రాణాలు కాపాడాల్సిన దుర్భరం
ఇదా ఈ భారతావనికి పట్టిన కర్మ..
ఇదేనా వైద్యో నారాయణో హరిః
ఎన్నో త్యాగాలు చేస్తూ
వెలకట్టలేని వారి సేవలకు
ఇదా మానవాళి ఇచ్చే బహుమానం?
ఇదెక్కడి మృగాళ్ళకు ఇచ్చే స్వేచ్ఛ?
అమ్మగా, ఆలిగా చెల్లిగా, నెచ్చెలిగా
ఎన్నో పాత్రల్లో ఒదిగి ఉండే స్త్రీమూర్తికి
ఇచ్చే బహుమానం.?
స్త్రీ మూర్తిని దేవతగా కొలిచే
ఈ పుణ్య భూమిలో
కలకత్తా కాళీ మాత సాక్షిగా
సభ్య సమాజం సిగ్గు పడేలా..
చిదిమి వేసిన ఈ సంఘటన
మానవ జాతికే మాయని మచ్చ.
మనిషి వికృత రూపానికి పరాకాష్ట..
శిరందాస్ శ్రీనివాస్
9441673339