Earlymoon trend : పెళ్లికి ముందే వధూ వరుల్లో ఆ ఇంట్రెస్ట్!

ఈ మధ్య జస్ట్ ఎంగేజ్ మెంట్ అయిందంటే చాలు. మ్యారేజ్ కంటే ముందే కాబోయే భార్యా భర్తలు కలిసి హనీ మూన్ ట్రిప్‌కు వెళ్తున్నారు.

Update: 2024-07-20 14:30 GMT

దిశ, ఫీచర్స్: సాధారణంగా ఎవరైనా పెళ్లి తర్వాత హనీమూన్‌కు వెళ్తుంటారు. ఇది కామన్. కానీ ఈ మధ్య జస్ట్ ఎంగేజ్ మెంట్ అయిందంటే చాలు. మ్యారేజ్ కంటే ముందే కాబోయే భార్యా భర్తలు కలిసి హనీ మూన్ ట్రిప్‌కు వెళ్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. దీనినే ముద్దుగా ‘ఎర్లీమూన్’ అంటున్నారు. అయితే ఈ నయా పోకడలపై సోషల్ మీడియాలో వేదికగా పలువురు డిస్కస్ చేస్తుండగా, కొందరు వ్యతిరేకిస్తే.. మరి కొందరు అదే బెటర్ అంటూ సమర్థిస్తున్నారు. ఐదారేండ్ల కిందట అతికొద్ది మంది మాత్రమే ‘ఎర్లీమూన్’కు ప్లాన్ చేసుకునే వారని, ప్రస్తుతం అలాంటి వారి సంఖ్య 10 శాతం పెరిగిందని నిపుణులు చెప్తు్న్నారు.

స్ట్రెస్ రిలీఫ్‌ కోసం..

పెళ్లి చూపులు, ఎంగేజ్‌మెంట్, ఆ తర్వాత పెళ్లి.. ఒకప్పుడు ఇవన్నీ ఓ ప్రాసెస్‌లో జరిగేవి. మహా అయితే ఓ ఐదారు నెలలు గ్యాప్‌లో జరిగిపోయేవి. కానీ ఇప్పుడు చూపుల తర్వాత ఎంగేజ్‌మెంట్, ఎంగేజ్ మెంట్ తర్వాత పెళ్లి వంటి కార్యక్రమాలకు చాలా మంది ఎక్కవ సమయాన్ని తీసుకుంటున్నారు. ముఖ్యంగా రిచ్ ఫ్యామిలీస్, యువతీ యువకులు తమ ఉద్యోగాలు, గోల్స్, ఇన్ కంప్లీట్ చదువుల కారణంగా పెళ్లిళ్లకు లేట్ చేస్తున్నారు. ఒకవేళ ఇలాంటి ఆలస్యం లేకపోయినప్పటికీ ఎంగేజ్‌మెంట్ తర్వాత వధూ వరుల కుటుంబాలు పెళ్లి ప్రిపరేషన్‌కు సంబంధించిన పనుల్లో బిజీ అయిపోతారు. కాబట్టి కాబోయే భార్య భర్తలు కూడా మెంటల్లీ ఒత్తిడిని ఎదుర్కొంటారు. అయితే పెళ్లిరోజు, ఆ తర్వాత కూడా ఇలాంటి ఒత్తిడి భావన లేకుండా ఉండటానికి, కపుల్స్ పరస్పరం అర్థం చేసుకోవడానికి ‘ఎర్లీమూన్’ ట్రిప్ బాగా ఉపయోగపడుతుందని రిలేషన్‌షిప్ అండ్ ట్రావెలింగ్ నిపుణులు చెప్తున్నారు.

ఏడాది ముందే ప్లాన్

ఎంగేజ్‌మెంట్ తర్వాత ప్రస్తుతం ఆర్నెల్లు, ఏడాది తర్వాత పెళ్లిళ్లు చేసుకునేవారి సంఖ్య పెరిగిపోతోంది. దీంతో మ్యారేజ్ కంటే ముందే వధూ వరుల మద్య సాన్నిహిత్యం పెరిగేందుకు ఎర్లీమూన్ ట్రిప్ మంచి అవకాశమని కపుల్స్‌తో పాటు వారి కుటుంబాలు భావిస్తున్నాయి. దీంతో జంటలు నచ్చిన ప్రాంతాలకు వెళ్లి ఎంజాయ్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రీ వెడ్డింగ్ ట్రిప్ అనొచ్చు. అయితే ఇలా ఎర్లీమూన్ ట్రిప్‌కు వెళ్లే వారు ఇక పెళ్లి తర్వాత హనీమూన్‌కు వెళ్లడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని నిపుణులు చెప్తున్నారు.

2017లో మొదటిసారి..

‘ది నాట్’ నివేదిక ప్రకారం.. ఎర్లీమూన్ ట్రెండ్ మొట్ట మొదటిసారి 2017లో బ్రిటీష్ రైటర్, కాలమిస్ట్, వేల్స్ యువరాణి అయిన కేథరీన్ సోదరి.. పిప్పా మిడిల్ టన్ స్టార్ట్ చేశారు. అప్పట్లో ఆమె తన డేటింగ్ పార్ట్‌నర్‌తో కలిసి పెళ్లికి ముందే కరేబియన్ దీవులకు వెళ్లింది. ఆ తర్వాత వారి కుటుంబాలు దీనిని ‘ఎర్లీమూన్ ట్రిప్‌’గా పేర్కొనడంతో అదే పేరుతో ఇతర జంటలు కూడా అనుసరించాయి. అయితే అప్పట్లో చాలా తక్కువగా దీనిని ఫాలో అయ్యేవారు. కానీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎర్లీమూన్ ట్రెండ్ ఫాలోవర్స్ పెరుగుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. 

Tags:    

Similar News