ఈనగాసి నక్కల పాలు చేసినట్లు..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం దాటినా, అవతరణ ఉత్సవాలు, ఊరేగింపులు తప్ప ప్రజల జీవన స్థితిగతులలో పెద్దగా మార్పు ఏమీ రాలేదు.

Update: 2024-06-20 01:15 GMT

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం దాటినా, అవతరణ ఉత్సవాలు, ఊరేగింపులు తప్ప ప్రజల జీవన స్థితిగతులలో పెద్దగా మార్పు ఏమీ రాలేదు. ప్రజల ఆశలు, డిమాండ్లు, ఉద్యమకారుల ఆకాంక్షలు అలాగే మిగిలిపోయాయి. ఓట్లు దండుకునేందుకు మాత్రమే రాజకీయ పార్టీలు వాటిని నినాదాలుగా వాడుకుంటున్నాయి. ఎన్నికల తర్వాత పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండిపోతోంది. అధికారంలోకి రాజకీయ పార్టీలు, నేతలు మాత్రమే మారుతున్నారు. పాలనా విధానాల్లో మార్పు మాత్రం ఉండడం లేదన్నది గమనించాల్సిన విషయం.

చారిత్రాత్మక తెలంగాణ విద్యార్థి ఉద్యమం (1969), తర్వాత చరిత్రను తెలియజేసేందుకు ఏర్పడినది తెలంగాణ స్టడీ సర్కిల్. త్యాగాలతో గాయాలతో, నిత్య నిర్బంధంలో ముందుకు సాగిన తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభ (1997-98). రాజకీయ ద్రోహానికి బలికాకుండా ప్రజా సంఘాల కూటమితో ఏర్పడిన తెలంగాణ ఐక్యరాచరణ కమిటీ (2006), తెలంగాణ ప్రజా ఫ్రంట్ (2010) ఉద్యమాన్ని ఊరకలెత్తించాయి. ప్రస్తుతం ఈ ప్రాంత ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారమైన ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్ష మరుగున పడిపోయింది. ప్రజా సంఘాల చరిత్రలను కనుమరుగు చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

త్యాగాల చరిత్రను ఆదర్శంగా నిలిపి..

తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనుల సమ్మె, సాగర హారాలు, మిలియన్ మార్చ్, వంటావార్పు, ఆట పాట, ధూమ్ ధామ్, ధర్నాలు, నిరాహార దీక్షలు, బంద్‌లు, రాస్తారోకోలు ఇలా పోరాట రూపాలు ఎన్నో… వీటన్నిటి లక్ష్యం నీళ్లు, నిధులు, నియామకాలు.. ఉద్యమ కాలంలో పోలీసుల కాల్పుల్లో కొందరు చనిపోయారు. రాజ్యహింసకు బలయ్యారు. తీవ్ర నిర్బంధానికి, అణిచివేతకు గురయ్యారు. బలిదానాలకు ఎరయ్యారు. అక్రమ కేసులలో ఇరికించబడ్డారు. అన్ని సమస్యలను ఎదుర్కొంటూ కూడా ప్రజలను చైతన్యపరిచారు. ఊరు వాడలను ఉప్పెనలా కదిలించారు. రాజకీయ పార్టీలు అన్నింటినీ ఒక తాటిపైకి తీసుకొచ్చారు. ఆత్మగౌరవ పోరాటంలా, స్వీయ పాలన కోసం తెగించి పోరాడారు. ఉద్యమాలను గల్లీలో రగిలించి, ఢిల్లీ పాలకులను వణికించారు. తప్పనిసరిగా పార్లమెంటులో బిల్లు పెట్టేలా చేసి, ఆమోదింపజేశారు. అమరుల త్యాగ ఫలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేలా ఒప్పించ గలిగారు. తెలంగాణ ఉద్యమకారుల చైతన్యాన్ని, త్యాగాల చరిత్రను దేశ ప్రజల ముందు ఆదర్శంగా నిలిపారు.

ఒక్క డిమాండూ నెరవేర్చలేదు

ఇంతలా పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం, భౌగోళికంగా ఏర్పడినా, ప్రజల భౌతిక పరిస్థితులలో మార్పు రాలేదు. ఉద్యమాల ఫలంగా ఏర్పడిన తెలంగాణ పరిస్థితి నేడు ఈన కాచి నక్కల పాలు చేసినట్లుగా ఉన్నది. పాలకుల సాచివేత ధోరణి అందుకు ప్రధాన కారణం. పాలకులు ఉద్యమకారుల ఊసెత్తక పోవడం శోచనీయం. నేటికీ తెలంగాణ ఉద్యమకారుల ప్రధాన డిమాండ్లు ఐనా, తెలంగాణ ఉద్యమ చరిత్రను పాఠ్యాంశాలలో బోధన అంశంగా చేర్చడం, మేధావులు, ఉద్యమకారులతో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయడం, విద్యారంగ బలోపేతానికి నిధులు కేటాయించి, ప్రైవేటు విద్యా సంస్థలను అరికట్టడం, ఉద్యమ కారులను రాష్ట్ర సాధన సమరయోధులుగా గుర్తించడం, ఉద్యమకారులపై మోపిన అక్రమ కేసులను రద్దు చేయడం, ఉద్యమ కాలంలో నిజాయితీగా పాల్గొని అరెస్ట్ అయినా, కాకపోయినా (కేసులు, జైలు లేని) ఉద్యమకారులందరినీ గుర్తించి సముచిత గౌరవం అందించడం వంటి డిమాండ్లను పట్టించుకోవడం లేదు.

ప్రజల ఆలోచనలు మారుతున్నాయి!

రాజకీయ పార్టీలు గానీ, పాలకులు గానీ ఉద్యమాల, ఉద్యమకారుల ఊసు లేకుండా కాలయాపన చేస్తున్నారు. కుంభకర్ణుడి నిద్ర నటిస్తున్న పాలకులను, ఉద్యమ కార్యాచరణ చైతన్య అంకుశంతో మేలుకొలపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్ని రకాల మాఫియా దోపిడీ నుంచి వనరుల రక్షణకు, ప్రభుత్వ రంగ సంస్థలు తెరిపించేందుకు, నిరుద్యోగ సమస్య నుంచి విముక్తి కోసం, రైతన్న సమస్యలు, విద్యా ఉద్యోగ రంగ సమస్యల నివారణ చర్యల కోసం, సింగరేణి రక్షణకు, కాలుష్య పరిశ్రమల రద్దు కోసం, కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాల వాగ్దనాల అమలుకు, పౌర, ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలే శరణ్యం. తెలంగాణలో ప్రజాస్వామ్యం పరిఢమిల్లాలంటే, చిత్తశుద్ధితో కూడిన విశాల ఐక్య ఉద్యమాల నిర్మాణం కార్యాచరణ అనివార్యం. పాలకుల వాగ్దానాలు ఎండమావులైన వేళ, అమరుల స్ఫూర్తిని ఎత్తి పడుతూ, మన భవిష్యత్తును మనమే నిర్మించుకుందామన్న ప్రజల ఆలోచనలో మార్పును మనం గమనించ గలం.

రమణాచారి

99898 63039

Tags:    

Similar News