గందరగోళంగా ‘రంగారావు’ హత్య!

ఓ హత్య మూడు కుటుంబాలను ఉరుకులు పరుగులు పెట్టించింది. మర్డర్ అయిన వ్యక్తి కోసం మూడు ఇండ్లలో విషాదం అములుకుంది.

Update: 2024-08-30 12:28 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఓ హత్య మూడు కుటుంబాలను ఉరుకులు పరుగులు పెట్టించింది. మర్డర్ అయిన వ్యక్తి కోసం మూడు ఇండ్లలో విషాదం అములుకుంది. కానీ అసలు చనిపోయింది మా ఇంటి వ్యక్తేనా అనే అనుమానం ఆ మూడిళ్లలో నెలకొంది.. చివరికి మృతదేహాన్ని చూశాకనే హత్యకు గురైంది ఎవరో తెలిసింది. ఇంతటి గందరగోళానికి కారణం ఆ ఒక్క పేరే. ఆ పేరే రంగారావు. ఇంతకూ ఏం జరిగిందంటే..?

ఏలూరు జిల్లా ముసునూరు మండలం గోపవరం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మంచి స్నేహితులు. ఆ ముగ్గురి పేర్లు కూడా రంగారావునే. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇవాళ ఈ ముగ్గురు మిత్రులు మద్యం సేవించారు. ఈ క్రమంలో ముగ్గురు మధ్య మాటామాట పెరిగి గొడవకు దారితీసింది. దీంతో క్షణికావేశంలో యలమర్తి రంగారావుపై తిరువీధుల రంగారావు చెక్కతో దాడి చేశాడు. బలమైన గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే రంగారావు హత్యకు గురయ్యాడనే వార్త గ్రామంలో దావనంలా వ్యాపించింది. కానీ చనిపోయింది ముగ్గురిలో ఏ రంగారావు అనేది క్లారిటీ లేక ఆయా కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కాసేపు గందరగోళానికి గురయ్యారు. ఆ తర్వాత మర్డర్ అయింది యలమర్తి రంగారావు అని తెలియడంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  


Similar News