OLA: మహిళపై క్యాబ్ డ్రైవర్ వేధింపులు.. ఓలా సంస్థకు భారీ జరిమానా

మహిళపై క్యాబ్ డ్రైవర్ వేధింపులకు పాల్పడ్డ కేసులో ఓలా సంస్థకు భారీ జరిమానా విధించడం జరిగింది.

Update: 2024-10-01 05:41 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మహిళపై క్యాబ్ డ్రైవర్ వేధింపులకు పాల్పడ్డ కేసులో ఓలా సంస్థకు భారీ జరిమానా విధించడం జరిగింది. ఐదు లక్షలు జరిమానా విధిస్తూ కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చింది. 2018 ఆగస్ట్ నెలలో ఓ మహిళ తన గమ్యస్థానానికి చేరుకునేందుకు ఓలా సంస్థకు చెందిన కారును బుక్ చేసుకుంది. అందులో వచ్చిన క్యాబ్ డ్రైవర్ ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడని మహిళ ఆరోపించింది. బ్యాక్ వ్యూ మిర్రర్ లో మహిళకు కనిపించేలా ఫోన్లో అశ్లీల చిత్రాలు చూడటమే గాక తన ముందే అసభ్యకరమైన చర్యలకు పాల్పడ్డాడని, గమ్యస్థానానికి ముందు క్యాబ్ ఆపడానికి నిరాకరించాడని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై ఓలాకు ఫిర్యాదు చేయగా.. డ్రైవర్ ను బ్లాక్ లిస్టులో ఉంచామని, కౌన్సిలింగ్ కు పంపుతామని తెలిపింది. డ్రైవర్ పై తదుపరి చర్య లు తీసుకోకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీనిపై పోలీసులు పోష్ చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసులో విచారణ జరపాలని జస్టిస్ ఎమ్‌జీఎస్ కమల్.. కంపెనీ అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఆదేశించారు. అంతేగాక దీనిపై 90 రోజుల్లో కోర్టు ముందు నివేధిక సమర్పించాలని పేర్కొన్నారు. దీనిపై ఓలా స్పందిస్తూ క్యాబ్ డ్రైవర్లు కంపెనీ ఉద్యోగులు కాదని, అందువల్ల పోష్ చట్టంలోని నిబంధనల ప్రకారం చర్యలకు అనుకూలం కాదని ఐసీసీ ద్వారా వెల్లడించింది. ఐసీసీ నివేదిక పై విచారణ జరిపిన న్యాయస్థానం ఓలా సంస్థ యాప్ డౌన్ లోడ్ చేసే సమయంలో కస్టమర్లకు భద్రత మరియు రక్షణ ఒప్పంద హామీలు ఇస్తుందని, ఈ ఒప్పంద హక్కులను ఉల్లంఘించినందుకు తగిన పరిహారం చెల్లించాలని హైకోర్టు తెలిపింది. బాధితురాలికి నేరుగా 5 లక్షలు పరిహారం కింద చెల్లించాలని ఓలా మాతృ సంస్థ ఏఎన్ఐ టెక్నాలజీస్ ను ఆదేశించింది. అంతేగాక వాజ్య ఖర్చుల కింద పిటీషనర్ కు అదనంగా 50 వేలు చెల్లించాలని జడ్జి ఎమ్‌జీఎస్ కమల్ తీర్పునిచ్చారు.


Similar News