Road Accident: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలైన విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) గుడిహత్నుర్ (Gudihathnur) మండల పరిధిలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
దిశ, వెబ్డెస్క్: రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలైన విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) గుడిహత్నుర్ (Gudihathnur) మండల పరిధిలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భైంసా (Bhainsa) నుంచి ఆదిలాబాద్కు వస్తున్న మాక్స్ పికప్ వాహనం మేకలగండి గ్రామం వద్ద అతివేగంతో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న సైడ్ పిల్లర్ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. మృతి చెందిన వారు ఆదిలాబాద్ టీచర్స్ కాలనీ (Teachers Colony)కి చెందిన మొజుద్దీన్ (60), మొయినొద్దీన్ (40), అలీ (8), ఉస్మానొద్దీన్ (10), ఉస్మాన్ (12)గా గుర్తించారు. అనంతరం గాయపడిన మరో ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.