జూబ్లీహిల్స్‌లో తీవ్ర విషాదం.. ఆర్ఎంపీ వైద్యుడి భార్య దారుణ హత్య

ఆర్ఎంపీ వైద్యుడి భార్యను గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా హత్య చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Update: 2024-10-01 03:21 GMT

దిశ, జూబ్లీహిల్స్: ఆర్ఎంపీ వైద్యుడి భార్యను గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా హత్య చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యూసఫ్‌గుడ, నవోదయ కాలనీ, గణపతి కాంప్లెక్స్ సమీపంలో నివాసం ఉండే ఉమామహేశ్వరరావు ఆర్ఎంపీ వైద్యుడిగా ఎల్లారెడ్డిగూడలోని ఆలయం పక్కన అమ్మ క్లినిక్ పేరిట ప్రాక్టీస్ చేస్తున్నాడు. నవోదయ కాలనీలోని ప్లాట్ నెంబర్.36‌లో రెండో అంతస్థులో భార్య సుధారాణి (44), కుమార్తె రుద్రా‌రాణి, కుమారుడు శ్రీకర్‌ చంద్రతో కలిసి ఉంటున్నాడు. సోమవారం సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చి పక్క వీధిలో ట్యూషన్‌కు అని వెళ్లారు.

భర్త ఉమామహేశ్వర రావు క్లినిక్‌కు వెళ్లాడు. అయితే, ట్యూషన్‌కు వెళ్లిన పిల్లలు తిరిగి ఇంటికి వచ్చే సరికి సుధారాణి రక్తపుమడుగులో పడి ఉంది. విషయాన్ని వారు వెంటనే పక్క ఫ్లాట్ వాళ్ల సాయంతో తండ్రికి ఫోన్ చేశారు. హత్య గురించి సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా అప్పటకే సుధారాణి ప్రాణాలు విడిచింది. కత్తితో ఎవరో గొంతు కోసి హత్య చేసినట్లుగా నిర్ధారణ అయింది. ఈ క్రమంలో పోలీస్ జాగిలాలు, క్లూస్ టీంను రంగంలోకి దించిన పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ మేరకు వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  


Similar News