మావోయిస్టుల ఘాతుకం.. ప్రెజర్ బాంబు పేలి వ్యక్తికి తీవ్రగాయాలు
మావోయిస్టులు అమర్చిన ప్రెజర్ బాంబు పేలడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

దిశ,ఏటూరునాగారం : మావోయిస్టులు అమర్చిన ప్రెజర్ బాంబు పేలడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కట్టెలు తెచ్చేందుకు అడవిలోకి వెళ్లిన వ్యక్తికి ఈ బాంబు పేల డంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నూగూరు వెంకటాపురం మండలంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నూగూరు వెంకటాపురం మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన సోడి నరసింగరావు, పూజారి నరేష్, బొగ్గుల కృష్ణమూర్తి, మరొక వ్యక్తి కలిసి నిచ్చెనల తయారీ కోసం అవసరమైన బొంగు కర్రల కోసం వెంకటాపురం మండలం వీరభద్ర గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గల ముత్యంధార జలపాతం వద్దకు వెళ్లారు. ఓ చోట ఎత్తు ప్రాంతంలో ఉన్న కర్ర కోసం బొగ్గు కృష్ణమూర్తి ముందుకు వెళ్లగా మావోయిస్టులు అమర్చిన ప్రెజర్ బాంబు పేలి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన కృష్ణమూర్తిని వైద్యం కోసం వెంకటాపురం ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు.