రోడ్డు ప్రమాదంలో తండ్రి- కొడుకుల దుర్మరణం

విధులకు హాజరయ్యేందుకు బయలుదేరిన కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం కబళించడంతో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Update: 2024-10-09 06:10 GMT

దిశ, లోకేశ్వరం: విధులకు హాజరయ్యేందుకు బయలుదేరిన కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం కబళించడంతో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కుటుంబ పెద్ద అతని కుమారుడు దుర్మరణం చెందగా భార్య కూతురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. లోకేశ్వరం మండలంలోని మన్మధ్ గ్రామానికి చెందిన సంగెం సురేష్ (27) అదే గ్రామంలో గల విద్యుత్ సబ్ స్టేషన్‌లో ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. దసరా సెలవుల్లో భార్యా పిల్లలతో పాటు అత్తగారి గ్రామం అయిన ఆదిలాబాద్ జిల్లా కుచులాపూర్ గ్రామానికి వెళ్లారు. ఈరోజు విధులకు హాజరయ్యేందుకు ఉదయం అత్తగారి ఇంటి నుంచి కారులో బయలుదేరిన ఆయన 10 నిమిషాల్లో గమ్యం చేరుతారనుకునేలోగా నర్సాపూర్ మండలంలోని తురాటి గ్రామ సమీపంలో నిర్మల్- బైంసా రహదారిపై కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో ఆయన కుమారుడు దీక్షిత్ కుమార్ (7) సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ఆయనతోపాటు భార్య, కూతురును చికిత్స కోసం నిర్మల్‌కు తరలించారు. ఇక చికిత్స పొందుతూ సంగెం సురేష్ మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News