డిసెంబర్లో 4.95 శాతానికి దిగొచ్చిన టోకు ద్రవ్యోల్బణం!
టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ (డబ్ల్యూపీఐ) గతేడాది డిసెంబర్లో 4.95 శాతానికి దిగొచ్చింది...
న్యూఢిల్లీ: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ (డబ్ల్యూపీఐ) గతేడాది డిసెంబర్లో 4.95 శాతానికి దిగొచ్చింది. అంతకుముందు ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఆహార పదార్థాలు, ముడి పెట్రోలియం ధరలు తగ్గడంతోనే టోకు ద్రవ్యోల్బణం దిగి రావడానికి కారణమని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటనలో తెలిపింది.
2022, నవంబర్లో టోకు ద్రవ్యోల్బణం 5.85 శాతంతో 21 నెలల కనిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. అలాగే, 2021, డిసెంబర్లో డబ్ల్యూపీఐ సూచీ 14.27 శాతంగా ఉంది. గత నెలలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) నిర్దేశించుకున్న లక్ష్యం 4 (+/-2) శాతానికి మరింత దిగువన డబ్ల్యూపీఐ సూచీ నమోదైంది. సమీక్షించిన నెలలో ఆహార ద్రవ్యోల్బణం మైనస్ 1.25 శాతం, ఇంధన, విద్యుత్ ద్రవ్యోల్బణం 18.09 శాతం, తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 3.37 శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ముఖ్యంగా ఆహార పదార్థాల్లో కూరగాయలు, మినరల్ ఆయిల్స్ ముడి పెట్రోలియం, సహజ వాయువు, వస్త్రాలు, రసాయనాలు, రసాయన ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గాయి. డిసెంబర్లో కూరగాయల ధరలు దాదాపు 36 శాతం పడిపోయాయి.