TKM India: మహారాష్ట్రలో రూ. 20,000 కోట్లతో టొయోటా కొత్త ప్లాంట్

ఛత్రపతి శంభాజీ నగర్‌లో గ్రీన్‌ఫీల్డ్‌ తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

Update: 2024-07-31 16:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ వాహన తయారీ సంస్థ టొయోటా కిర్లోస్కర్ మోటార్(టీకేఎం) ఇండియా మహారాష్ట్రలో దాదాపు రూ. 20,000 కోట్ల పెట్టుబడితో కొత్త ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం జరిగినట్టు తెలిపింది. ఛత్రపతి శంభాజీ నగర్‌లో గ్రీన్‌ఫీల్డ్‌ తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రతిపాదించిన పెట్టుబడుల ద్వారా ఈ ప్రాంతంలో భారీగా ఉద్యోగాలు, ఆర్థిక వృద్ధికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. కొత్త ప్లాంటు ద్వారా కంపెనీ తన వ్యాపార, లాజిస్టికల్ అవసరాలను తీర్చేందుకు వీలవుతుందని, తద్వారా కంపెనీ దేశీయంగానే కాకుండా విదేశాల్లోనూ విస్తరణకు వీలుంటుందని టీకేఎం వివరించింది. ప్రధానంగా కొత్త ప్లాంటును క్లీన్ అండ్ గ్రీన్ మొబిలిటీ పరిష్కారంగా నిర్మిస్తామని, గ్లోబల్ తయారీ హబ్‌గా మార్చేందుకు సామర్థ్యం ఉంటుందని కంపెనీ పేర్కొంది. భారత్‌లో తయారీని మధ్యప్రాచ్యం, ఈస్ట్ ఏషియా ప్రాంతాల్లో కీలకంగా పునర్నిర్మించనున్నట్టు కమెపెనీ ఎండీ, సీఈఓ మసకాజు యోషిమురా వెల్లడించారు. కాగా, టొయోటా కంపెనీకి ఇప్పటికే కర్ణాటక బెంగళూరులోని బిదాడిలో రెండు యూనిట్లను నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు యూనిట్ల నుంచి 3.42 లక్షల వాహనాల ఉత్పత్తి చేస్తోంది. 

Tags:    

Similar News