Air India: ఎయిర్ ఇండియా ఉన్నతాధికారులు, సిబ్బంది ఎకానమీలోనే ప్రయాణించాలి
ప్రీమియం సీట్లను వినియోగదారుల కోసం కేటాయించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: టాటా గ్రూప్ యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిర్ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలోని సీనియర్ మేనేజ్మెంట్తో సహా సిబ్బంది ఏప్రిల్ 1 నుంచి ఎకానమీ క్లాస్లోనే ప్రయాణించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రీమియం సీట్లను వినియోగదారుల కోసం కేటాయించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ఉద్యోగులు బయలుదేరడానికి 50 నిమిషాల ముందు ఆ సీట్లు అమ్ముడుపోకుండా ఉంటే మాత్రమే ప్రీమియం ఎకానమీ లేదా బిజినెస్ క్లాస్కి అప్గ్రేడ్ చేసుకేందుకు అనుమతించనున్నారు. తరచుగా విమానాలు ఆలస్యం అవుతున్నాయనే విమర్శల నేపథ్యంలో ఎయిర్ ఇండియా తన సర్వీస్, కస్టమర్ ఎక్స్పీరియన్స్ను మెరుగుపరచుకునే ప్రయత్నంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంది. ప్రీమియం సీట్లకు అధిక డిమాండ్ ఏర్పడటం కూడా ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. ఎయిర్ఇండియా కొత్త యాజమాన్యం కస్టమర్లకు ప్రాధాన్యత ఇస్తూ, అందుకు తగినట్టుగా మార్పులు కలిగి ఉండాలని భావిస్తోందని కంపెనీ ప్రతినిధి చెప్పారు. ప్రభుత్వ డేటా ప్రకారం, గత దశాబ్దంలో దేశీయ విమాన ప్రయాణాలు ఏటా 10-12 శాతం పెరుగుతోంది. దేశీయ విమానయాన మార్కెట్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో ఒకటిగా ఉంది. ఎక్కువ మంది వ్యక్తులు విమాన ప్రయాణాలకు ఆసక్తి చూపిస్తుండటంతో మెరుగైన సర్వీస్, సీట్లను అందుబాటులో ఉంచేలా ఎయిర్లైన్పై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలోనే కంపెనీ అందుకు అవసరమైన మార్పులు చేపడుతోంది.