Telegram: టెలిగ్రామ్‌లో సమస్యాత్మక కంటెంట్‌పై ఉక్కుపాదం

ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌లో సమస్యాత్మక కంటెంట్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు

Update: 2024-09-24 08:12 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌లో సమస్యాత్మక కంటెంట్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడే యూజర్ల వివరాలను ప్రభుత్వానికి అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ పావెల్ దురోవ్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తుల ఇంటర్నెట్ IP అడ్రస్, ఫోన్ నంబర్‌లతో సహా ఉల్లంఘించిన వారి వివరాలను అధికారులకు ఇవ్వడానికి నిబంధనలను, ప్రైవసీ విధానాన్ని అప్‌డేట్ చేసినట్లు దురోవ్ తెలిపారు. డ్రగ్స్‌, ఇతర హానికరమైన వస్తువులను విక్రయించడానికి టెలిగ్రామ్‌ను ఉపయోగించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని, ఇలాంటి కంటెంట్‌ను గుర్తించడానికి గత కొన్ని వారాలుగా కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తున్నామని దురోవ్ తన 13 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లకు వ్యక్తిగత సందేశ చానెల్ ద్వారా తెలియజేశాడు.

మా ప్లాట్‌ఫారమ్ సమగ్రతను దెబ్బతీసే ఎలాంటి చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను యాప్ ద్వారా షేర్ చేయడానికి ఇకపై కుదరదు అని దురోవ్ పేర్కొన్నాడు. ఇటీవల కాలంలో టెలిగ్రామ్ యాప్ ద్వారా తప్పుడు కంటెంట్ వ్యాప్తిని అరికట్టడంలో విఫలం అయ్యారనే ఆరోపణలతో ఆగస్ట్ 24న ప్రైవేట్ జెట్‌లో పారిస్ వెలుపల లే బోర్గెట్ విమానాశ్రయానికి చేరుకున్న దురోవ్‌ని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయనకు షరతులతో కూడిన బెయిల్ లభించింది. మొదట్లో అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించిన దురోవ్ ఆ తరువాత పారిస్ ప్రభుత్వ డిమాండ్లకు అనుగుణంగా టెలిగ్రామ్‌లో చట్టవిరుద్ధమైన కంటెంట్ వ్యాప్తికి అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తాజాగా ఆయన నుంచి ప్రకటన వెలువడింది.


Similar News