Direct tax: పదేళ్లలో 182 శాతం పెరిగిన ప్రత్యేక్ష పన్ను వసూళ్లు

పదేళ్ల క్రితం 2014-15 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు దాదాపు రూ. 6.96 లక్షల కోట్లుగా ఉన్నాయి.

Update: 2024-10-17 16:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: గడిచిన పదేళ్ల కాలంలో భారత ప్రత్యక్ష పన్ను వసూళ్లు గణనీయంగా పెరిగాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 182 శాతం పెరిగి రూ. 19.60 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఆదాయపు పన్ను శాఖ తాజాగా విడుదల చేసిన టైమ్ సిరీస్ డేటా ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వచ్చిన మొత్తం వసూళ్లలో కార్పొరేట్ వసూళ్లు గడిచిన పదేళ్లలో రెండింతలు పెరిగి రూ. 9.11 లక్షల కోట్లకు, వ్యక్తిగత ఆదాయపు పన్ను నాలుగు రెట్లు పెరిగి రూ. 10.45 లక్షల కోట్లకు చేరుకున్నాయి. పదేళ్ల క్రితం 2014-15 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు దాదాపు రూ. 6.96 లక్షల కోట్లుగా ఉన్నాయి. అందులో కార్పొరేట్ పన్నులు రూ. 4.29 లక్షల కోట్లు, వ్యక్తిగత ఆదాయ పన్ను రూ. 2.66 లక్షల కోట్లు ఉన్నాయి. ఇదే సమయంలో 2014-15లో మొత్తం 4.04 కోట్ల ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు కాగా, 2023-24 నాటికి 8.61 కోట్లకు చేరాయి. ఇక పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2014-15లో 5.70 కోట్లు ఉండగా, 2023-25 నాటికి 10.41 కోట్లకు చేరారని నివేదిక పేర్కొంది. 

Tags:    

Similar News