దసరా తర్వాత అన్ని డాక్యుమెంట్లను తీసుకు వస్తా: సీఐడీకి లోకేశ్ సన్నిహితుడు లేఖ

Update: 2023-10-17 06:59 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ స్కిల్ డవలప్ మెంట్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అత్యంత సన్నిహితుడు కిలారు రాజేశ్ సీఐడీ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా ఈనెల 16న సీఐడీ అధికారులు సుమారు ఆరుగంటలకు పైగా కిలారు రాజేశ్‌ను విచారించారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలపై ఆరా తీశారు. అనంతరం మంగళవారం కూడా విచారణకు హాజరుకావాలని సీఐడీ ఆదేశించింది.విచారణకు హాజరయ్యే సమయంలో స్కిల్ స్కాంకు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్లు తీసుకురావాలని సూచించారు. మంగళవారం ఉదయం 10 గంటలకు డాక్యుమెంట్లతో సీఐడీ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. సీఐడీ ఆదేశాల నేపథ్యంలో కిలారు రాజేశ్ కీలక లేఖ రాశారు. దసరా తర్వాత అన్ని డాక్యుమెంట్లను తీసుకు వస్తానని లేఖలో పేర్కొన్నారు. సీఐడీ కోరిన డాక్యుమెంట్లు తీసుకురావడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని ఆయన ఆ లేఖలో స్పష్టం చేశారు. దసరా తర్వాత సీఐడీ కోరిన డాక్యుమెంట్లను తీసుకు వస్తానని ఆ లేఖలో రాజేశ్ పేర్కొన్నారు. ఇకపోతే స్కిల్ స్కాం కేసులో సీఐడీ దాఖలు చేసిన చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో కిలారు రాజేశ్ పేరును ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో కిలారు రాజేశ్ ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టులో ఈ పిటిషన్‌పై విచారణ జరపగా.. రాజేశ్‌ను స్కిల్ స్కాం కేసులో నిందితుడిగా చేర్చలేదని సీఐడీ స్పష్టం చేసింది. ఒకవేళ నిందితుడిగా చేర్చితే 41 ఏ ప్రకారం నోటీసు ఇచ్చి ప్రశ్నిస్తామని సీఐడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. దీంతో ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణను ముగించింది. ఇకపోతే సీఐడీ ఈనెల 16న విచారణకు హాజరుకావాలని 41ఏ నోటీసులు ఇవ్వడంతో రాజేశ్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. 

Read More..

స్కిల్ స్కాం కేసు: చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా  

Tags:    

Similar News