ఆ రెండు మండలాల ప్రజలు అప్రమత్తం కావాలి:జిల్లా కలెక్టర్

వరద ఉధృతి మరలా పెరుగుతున్న దృష్ట్యా గోదావరి నదీ తీర ప్రాంతంలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు.

Update: 2024-09-03 13:46 GMT

దిశ, ఏలూరు:వరద ఉధృతి మరలా పెరుగుతున్న దృష్ట్యా గోదావరి నదీ తీర ప్రాంతంలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు. మంగళవారం సాయంత్రం 5.00 గంటలకు భద్రాచలం వద్ద 38.50 అడుగులకు గోదావరి నీటిమట్టం నమోదైయిందని ఇది మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ముంపుకు గురయ్యే ప్రాంతాల ప్రజలను తరలించాలని అధికారులను ఆదేశించారు. వరద నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.

వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు నిర్ధేశించిన మార్గదర్శకాలు పాటించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయకముందే ముంపు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ముఖ్యంగా ఆయా గ్రామాల్లో గర్భిణులు, అనారోగ్యంగా ఉన్న వారిని, వృద్ధులను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. గోదావరి ఉధృతి దృష్ట్యా ఆయా మండలాల ప్రజలు పరివాహక ప్రాంతాల్లోకి వెళ్లవద్దన్నారు. వరద పరిస్థితిపై కలెక్టర్ వెట్రిసెల్వి ఎప్పటికప్పుడు అధికారులతో టెలిఫోన్ ద్వారా సమీక్షించి అవసరమైన సూచనలను అందజేస్తున్నారు.


Similar News