గోదావరి మళ్లీ ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక..!

గోదావరి ఉగ్రరూపం దాల్చింది..

Update: 2024-09-11 01:58 GMT

దిశ, పోలవరం: గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద వరద ప్రవాహం ప్రమాదకరంగా పరిణమించడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు విపరీతంగా వరద నీరు గోదావరిలో పెరుగుతుండడంతో దిగువన ఉన్న పోలవరం ప్రాజెక్టు వద్ద పరిస్థితి ఆందోళనకరంగా మారింది. భద్రాచలం వద్ద నీటిమట్టం మంగళవారం సాయంత్రం 6 గంటలకు 48.20 అడుగులుగా నమోదయింది. ఈ వరద నీటి మట్టం రాత్రికి 50 అడుగులు దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. బుధవారం ఉదయానికి మూడో ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి ప్రవహిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం గోదావరిలో భద్రాచలం వద్ద 11,33,815 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది.

పట్టిసీమ శివక్షేత్రాన్ని చుట్టుముట్టి..

పోలవరం వద్ద గోదావరి ఉగ్రంగా మారింది. అనూహ్యంగా వరద నీరు ప్రవహిస్తుండడంతో పోలవరం ప్రాజెక్టు నుంచి 10,39,627 క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. వరద నీరు పట్టిసీమ శివక్షేత్రాన్ని చుట్టుముట్టింది. పోలవరం మండలం ఎల్‌ఎన్‌డి పేట వద్ద కొవ్వాడ రిజర్వార్‌ నుంచి గత రాత్రి 480 క్యూసెక్కులు, ఉదయం 360 క్యూసెక్కుల జలాలను దిగువకు విడుదల చేశారు. రిజర్వాయర్ నీటిమట్టం 89.70 మీటర్లు నమోదయినట్లు రిజర్వాయర్ సిబ్బంది సత్యన్నారాయణ తెలిపారు. కొవ్వాడ వరద పట్టిసీమ అవుట్ ఫాల్ స్లూయిజ్ నుండి గోదావరిలోకి ఉధృతంగా ప్రవహిస్తోంది.


Similar News