ఏపీలో రేపటి నుంచి పల్లె పండుగ వారోత్సవాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి సోమవారం నుంచి పల్లె పండుగ వారోత్సవాలను నిర్వహించనున్నారు.
దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి సోమవారం నుంచి పల్లె పండుగ వారోత్సవాలను నిర్వహించనున్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 13,324 గ్రామాల్లో ఈ కార్యక్రమం కొనసాగనుంది. కృష్ణా జిల్లా కంకిపాడులోని పల్లె పండుగ వారోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొంటారు. గ్రామీణ అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ లక్ష్యంగా పల్లె పండుగ నిర్వహిస్తున్నారు. పల్లె పండుగ వారోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 4,500 కోట్ల నిధులతో 30,000 పనులను చేపట్టనున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ పనులలో 3,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల తారు రోడ్లు, వ్యవసాయ కుంటలు, పశువుల శాలలు, ఇంకుడు గుంతల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లుగా తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామీణ స్థాయిలో వ్యవసాయం, నీటి పారుదల, రవాణా వ్యవస్థలను మరింత బలోపేతం చేయడం పల్లె పండుగ వారోత్సవ కార్యక్రమం లక్ష్యమని వెల్లడించారు.