తేమశాతంతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తాం: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

రాష్ట్రంలో మిచౌంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు హామీ ఇచ్చారు.

Update: 2023-12-06 12:12 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో మిచౌంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాల ఆదుకుంటామని...అధైర్య పడవద్దని రైతులకు భరోసా నిచ్చారు. పామర్రు, గుడూరు, బందరు, పెడన, బంటుమిల్లి మండలాల్లో బుధవారం మంత్రి కారుమూరి పర్యటించారు. దెబ్బతిన్న వరి పొలాలు, ధాన్యం రాశులు పరిశీలించి రైతులతో మాట్లాడారు. పంట నష్టం గురించి, రైతుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆరబెట్టిన ధాన్యం రాశులు పరిశీలించారు. మిచౌంగ్ తుఫాన్ అకాల వర్షాలకు పంట దెబ్బతిన్న రైతాంగానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎన్యుమరేషన్ బృందాలు ప్రతి గ్రామంలో పర్యటించి పంట నష్టం వివరాలు నమోదు చేసుకుని...అంచనాలు రూపొందించి, రైతులకు పంటల భీమా, ఇన్ పుట్ సబ్సిడీ ప్రయోజనాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. తేమశాతంతో సంబంధం లేకుండా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఆన్ లైన్‌లో 1.37 లక్షల మెట్రిక్ టన్నులు, ఆఫ్ లైన్ లో 1.10 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, ఇప్పటివరకు రైతులకు రు.1070 కోట్ల రూపాయలు చెల్లింపులు చేసినట్లు మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. ధాన్యం విక్రయించిన రైతులకు వేగంగా చెల్లింపులు చేస్తామని, రెండు, మూడు రోజులకోసారి రైతులకు చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకుంటామని, రవాణా, హమాలీ చార్జీలు సత్వరమే చెల్లించుటకు చర్యలు తీసుకుంటామని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. కౌలుదారి రైతులు సొసైటీల ద్వారా ధాన్యం విక్రయించాలని మంత్రి సూచించారు. అట్టి వారికి సొసైటీల ద్వారా చెల్లింపులు చేయడం జరుగుతుందని చెప్పుకొచ్చారు. అక్కడక్కడ మినుము పంట కూడా నీట మునిగి దెబ్బతిన్నదనీ ఆదుకోవాలని రైతులు మంత్రిని కోరగా, సబ్సిడీపై మినుము విత్తనాలు మళ్లీ రైతులకు అందించుటకు చర్యలు తీసుకుంటామని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వెల్లడించారు.

Tags:    

Similar News