కౌలురైతులకే పరిహారం అందేలా చట్టాన్ని సవరిస్తాం :టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్

ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో వెనువెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రావడం లేదు’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.

Update: 2023-12-10 07:48 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ‘ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో వెనువెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రావడం లేదు’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని తెలిసి హడావిడిగా బయటకొచ్చి తూతూ మంత్రపు పరామర్శలు చేశారు అని ఆరోపించారు. తుని నియోజకవర్గం ఒంటి మామిడి సమీపంలో ఆదివారం నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను లోకేశ్ పరామర్శించారు. పంట చేతికొచ్చే సమయంలో తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయాం అని లోకేశ్ వద్ద రైతులు మెురపెట్టుకున్నారు. వారం రోజులు కావస్తున్నా తమ పొలాల వద్దకు చూసిన నాథుడు లేడు అని అన్నారు. ఎకరాకు రూ.30వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టాం, కష్టమంతా తుఫాను పాలయిందన్నారు. గతంలో తుఫాన్లు వచ్చినపుడు ప్రభుత్వం తరపున వచ్చిన సాయం కూడా భూయజమానులకే ఇచ్చారు తప్ప కౌలురైతులను పట్టించుకోలేదు అన్నారు. మీరు అధికారంలోకి వచ్చాక కౌలురైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి అని లోకేశ్‌ను కోరారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... పంటలబీమా సొమ్మును తామే చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ ఏడాది కేవలం 16మంది రైతులకు మాత్రమే బీమా చెల్లించిందంటే రైతులపట్ల ఎంత నిర్లక్ష్యం వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు అని అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా అమలుచేస్తాం అని చెప్పుకొచ్చారు. ప్రకృతి వైపరీత్యాల్లో పంటలు దెబ్బతిన్న సమయంలో కౌలురైతులకే పరిహారం అందేలా చట్టాన్ని సవరిస్తాం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు.

Tags:    

Similar News