స్వామి భక్తి.. దుర్గగుడి ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు
వైసీపీ నేతలకు ప్రోటోకాల్ పాటించడంతో పాటు, అంతరాలయ దర్శనం కల్పించిన విజయవాడ దుర్గగుడి ఉద్యోగి రత్నారెడ్డిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ దుర్గగుడి (Vijayawada Durga Temple)లో ఓ ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు పడింది. వేలాదిమంది భక్తులు ఎన్నో గంటలసమయంలో వేచి ఉండి అమ్మవారిని దర్శించుకుంటుండగా.. కొందరు ఉద్యోగులు గత పాలకుల పట్ల స్వామిభక్తిని ప్రదర్శించడమే ఇందుకు ప్రధాన కారణం. దేవినేని అవినాశ్ (Devineni Avinash) ఆలయానికి రాగా.. విధుల్లో ఉన్న కొందరు సిబ్బంది ఆయన్ను లిఫ్ట్ దారిలో ఆలయానికి తీసుకొచ్చారు. అవినాశ్ సహా.. ఇతర వైసీపీ నేతల పట్ల ప్రోటోకాల్(Protocol) పాటించడంతో పాటు.. అంతరాలయ దర్శనం చేయించారని తెలుస్తోంది.
సాధారణంగా అధికారంలో ఉన్న నేతలకే ప్రోటోకాల్ పాటించి, అంతరాలయ దర్శనానికి అనుమతిస్తారు. కానీ.. ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించడంతో ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. దాంతో దుర్గగుడి ఉద్యోగి రత్నారెడ్డిని సస్పెండ్ చేశారు. వైసీపీ నేతలకు అంతరాలయ దర్శనం కల్పించడంలో ఇతర అధికారుల పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు.