CM Chandrababu: "నన్ను చంపడానికి కుట్ర".. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

తాను జైల్లో ఉండగా చంపేందుకు కుట్రపన్నారన్న ప్రచారం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కక్ష తీర్చుకునే మనిషిని కాదని, సమయం వచ్చినపుడు అందరిపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Update: 2024-10-09 15:29 GMT

దిశ, వెబ్ డెస్క్: పొలిటికల్ గవర్నెన్స్ అంటే ప్రజలను ఇబ్బంది పెట్టడం కాదన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బుధవారం సాయంత్రం ఉండవల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను జైలులో ఉన్నప్పుడు తనను చంపడానికి కుట్ర పన్నారన్న ప్రచారం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై 53 రోజులు జైలులో ఉన్నప్పుడు.. జైలుపై డ్రోన్లు ఎగురవేసి, జైలు గదిలో సీసీ కెమెరా పెట్టి తన ప్రతి కదలికను గమనించారని చెప్పారు. కనీసం వేడినీరు కూడా ఇవ్వలేదని, దోమలు కుడుతుంటే దోమతెర కూడా ఇవ్వలేదని వాపోయారు. జైలులో ఉన్నప్పుడు అంత నరకం అనుభవించిన తాను.. బయటికొచ్చాక కక్ష తీర్చుకోవాలి.. కానీ తనది అలాంటి స్వభావం కాదన్నారు చంద్రబాబు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో.. ఆ బాధలన్నీ తనకు తెలుసన్నారు. తప్పుచేసిన ఏ ఒక్కరూ తప్పించుకోలేరని, సరైన సమయంలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఢిల్లీకి ఇన్నిసార్లు వెళ్లడం వల్లే పరిస్థితులు చక్కబడుతున్నాయని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంకా తమ ప్రయత్నం చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు.

ప్రజాప్రతినిధులను సహించను

మద్యం టెండర్లలో ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకుంటున్నారని వార్తలొచ్చిన నేపథ్యంలో.. అలాంటి వారిని సహించబోనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మద్యం టెండర్లు పారదర్శకంగా జరగాలని, ఇందులో పోటీ ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆదాయం కోసం పోటీని పెంచుతున్నారన్న విమర్శలు ఉన్నా అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుని వెళ్లాలన్నారు. ఎలాంటి విషయంలోనైనా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చే చర్యల్ని ఉపేక్షించబోనని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ఇసుక లభ్యత తక్కువగా ఉండటంతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, త్వరలోనే వాటిని అధిగమించి అవసరమైన వారందరికీ ఇసుకను సరఫరా చేస్తామన్నారు. 

Tags:    

Similar News