AP Cabinet:ఏపీ మంత్రివర్గ సమావేశం..కేబినెట్లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!
సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది.
దిశ, డైనమిక్ బ్యూరో:సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పేపర్ లెస్ విధానంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధానంలో కేబినెట్ నిర్వహించారు. ఇప్పటికే మంత్రులందరికీ ట్యాబ్లు అందజేసి వారికి శిక్షణ కూడా ఇచ్చారు.
కేబినెట్లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..
గత ప్రభుత్వం తీసుకువచ్చిన రివర్స్టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. పోలవరం ఎడమ కాలువ పునరుద్ధరణ కు ఆమోదం లభించింది. ఈ పనులకు ప్రస్తుతం చేస్తున్న కాంట్రాక్టర్నే కొనసాగిస్తారు. అబ్కారీ శాఖ పునర్ వ్యవస్థీకరణ మంత్రివర్గం నిర్ణయించింది. ఇందులో భాగంగా స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎక్సైజ్ శాఖకు ప్రత్యామ్నాయంగా గత ప్రభుత్వం ఈ వ్యవస్థను తీసుకువచ్చింది. అదేవిధంగా పట్టాదారు పాసు పుస్తకాల పై ఉన్న మాజీ సీఎం జగన్ బొమ్మను, రాజకీయ లోగోలను కూడా తొలగించనున్నారు.
దీనిపై ఇక నుంచి రాజముద్రను ముద్రించి అందజేస్తారు. 21.86 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలపై కొత్తగా ప్రభుత్వ అధికారిక చిహ్నాన్ని వేస్తారు. అదేవిధంగా 77 లక్షల సర్వే రాళ్ల పై కూడా జగన్ బొమ్మను తొలగించి వినియోగించుకునేందుకు కేబినెట్ఆమోదం తెలిపింది. 22ఎ, ప్రీ హోల్డు భూముల వివాదంపై రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. వివాదాల్లో ఉన్న భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేతకు మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. రాష్ట్రంలో కొత్తగా 2,774 రేషన్ దుకాణాల ఏర్పాటు చేయనున్నారు. ఈ రేషన్ దుకాణాల్లో ఈ పాస్ మిషన్ల కొనుగోలుకు నిధులు కేటాయించనున్నారు. మున్సిపల్ శాఖలో 269 సూపర్ న్యూమరీ పోస్టులు భర్తీ చేపట్టనున్నారు. ఇంకా పలు అంశాలపై కేబినెట్లో చర్చ కొనసాగుతోంది.