ఏపీలో మళ్లీ భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు వార్నింగ్
ఆంధ్రప్రదేశ్కు మరోసారి ముప్పు తప్పదని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది..
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కు ఇంకా ముప్పు తప్పలేదు. ఇటీవల భారీగా వర్షం కురిసి నానా బీభత్సం జరిగింది. రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షం కురవడంతో వరదలు వచ్చిన విషయం తెలిసిందే. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలో వాగులు, వంకలు పొంగి ప్రజలకు అపార నష్టం చేశాయి. విజయవాడంలో అయితే ప్రజలను అతలాకుతలం చేశాయి. ఎప్పుడూ చూడని విపత్తును ఆ ప్రాంత వాసులు చూశారు. ప్రస్తుతం పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. కానీ మరోసారి ప్రమాదం పొంచి ఉన్నట్లుగా తెలుస్తోంది.
అరేబియా సముద్రం(Arabian Sea)లో అల్పపీడనం ఏర్పడింది. అది రెండు, మూడు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(Indian Meteorological Department) స్పష్టం చేసింది. ఈ నెల 14 నుంచి 16 వరకు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రైతులు, గొర్రెలకాపరులు చెట్లకు కిందకు వెళ్లొద్దని, పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని, సముద్ర తీరం వెంట ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.