Tirupati Laddu : సింహాచలం ఆలయంలో ప్రసాదాల తయారీపై ఎమ్మెల్యే గంటా అసంతృప్తి

Update: 2024-09-21 09:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల లడ్డూ (Tirupati Laddu Cotroversy) ప్రసాదంలో కల్తీ జరిగిందనే ఆరోపణలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. స్వామివారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు పదార్థాలు కలిశాయని ఆరోపిస్తున్న టీడీపీ ప్రభుత్వం (TDP Government) దీనిపై సమగ్ర విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) సింహాచలం ఆలయంలో పర్యటించి అక్కడి ప్రసాదాల కోసం వినియోగిస్తున్న ముడి సరుకులను పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముందుగా భక్తులకు ప్రధాన ప్రసాదం రూపంలో ఇస్తున్న లడ్డూలో నెయ్యి (Ghee) వాసన లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. నెయ్యి రుచి కూడా బాలేదని అన్నారు. అనంతరం మాట్లాడుతూ.. కిలో నెయ్యి రూ.341కే సరఫరా చేస్తున్నారంటే నాణ్యత పరిశీలించారా..? అని అధికారులను ప్రశ్నించారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy) తెచ్చిన రివర్స్ టెండరింగ్ వల్ల కలిగిన అనర్థాలని మండిపడ్డారు.

‘‘భక్తుల మనోభావాలతో ఆడుకున్న జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి శిక్ష విధించాలో ప్రజలు, భక్తులే నిర్ణయించాలి. వైసీపీ నేతలు ఇప్పటికీ ప్రభుత్వంపై ఎదురు దాడి చేస్తున్నారు. విజిలెన్స్, ఫుడ్ క్వాలిటీ విభాగాల నుంచి కూడా అధికారులు వచ్చి వీటిని తనిఖీ చేస్తున్నారు. దేవాలయాలకు పూర్వ వైభవం తెచ్చేటట్లుగా, ప్రసాదాలు నాణ్యంగా ఉండేటట్లుగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వ్యవస్థలను చక్కదిద్దడానికి సీఎం చంద్రబాబునాయుడు (CM Chandrababu Naidu) నేతృత్వంలో ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’’ అని గంటా పేర్కొన్నారు. అనంతరం ఆలయంలో అన్న ప్రసాదం స్వీకరించి.. అక్కడి భక్తులతో గంటా శ్రీనివాసరావు సంభాషించారు. అలాగే ప్రసాదాల నాణ్యతపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.


Similar News