అరసవిల్లిలో అద్భుత దృశ్యం.. రెండేళ్ల తర్వాత స్వామివారిని స్పృశించిన సూర్య భగవానుడు

అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఏకంగా రెండేళ్ల తర్వాత మళ్లీ స్వామి వారి మూలవిరాట్టుని సూర్యకిరణాలు తాకాయి.

Update: 2024-10-01 03:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం (Arasavilli Sri SuryaNarayana Swamy Temple)లో ఏకంగా రెండేళ్ల తర్వాత మళ్లీ స్వామి వారి మూలవిరాట్టుని సూర్యకిరణాలు తాకాయి. మంగళవారం ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. స్వామివారి మూలవిరాట్‌ మూర్తిపై సూర్యకిరణాలు నేరుగా పడే మహత్తర ఘటన ఈ రోజు ఉదయం 6:05 గంటలకు ఆవిష్కృతమైంది. దాదాపు 2 నిమిషాల పాటు కనువిందు చేసిన ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. లేలేత సూర్య కిరణాల (Sun Rays) స్పర్శతో స్వామి వారి మూలవిరాట్ స్వరూపం దేదీప్యమానంగా వెలిగిపోతూ భక్తులకు దర్శనిమిచ్చింది. కాగా.. ఈ దృశ్యం రేపు బుధవారం నాడు కూడా మళ్లీ ఆవిష్కృతం కానుంది.

ఇదిలా ఉంటే.. శ్రీకాకుళం (Srikakulam) పట్ణణానికి 2 కి.మీ దూరంలోని అరసవల్లి గ్రామంలో ఉంది. ఇక్కడ కొలువైన సూర్యనారాయణ మూర్తి తన భక్తులకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించే దైవంగా వెలుగొందుతున్నాడు. ప్రతి ఏటా దక్షిణాయంలో అక్టోబర్ 1, 2 తేదీల్లో ఉత్తరాయణంలో మార్చి 9,10 తేదీల్లో సూర్యకిరణాలు ఆలయంలోని మూలవిరాట్‌ను నేరుగా తాకుతాయి. అయితే వాతావరణ సమస్యల వల్ల రెండేళ్లుగా ఈ సూర్యకిరణాలు స్వామివారిని స్పృశించకలేకపోయాయి.


Similar News