నిలకడగా గోదావరి..భద్రాచలం వద్ద స్వల్పంగా పెరుగుతున్న వరద
ఏలూరు జిల్లా పోలవరం వద్ద గోదావరి వరద ప్రవాహం నిలకడగా ఉంది. ఎగువన భద్రాచలం వద్ద వరద నీటి మట్టం శనివారం సాయంత్రం 38.90 అడుగులకు చేరింది.
దిశ, పోలవరం:ఏలూరు జిల్లా పోలవరం వద్ద గోదావరి వరద ప్రవాహం నిలకడగా ఉంది. ఎగువన భద్రాచలం వద్ద వరద నీటి మట్టం శనివారం సాయంత్రం 38.90 అడుగులకు చేరింది. భద్రాచలం వద్ద వరద స్వల్పంగా పెరుగుతూ వస్తోందని ఇరిగేషన్ అధికారులు చెప్పారు. అయితే ఈ వరద వల్ల ప్రజెంట్ ప్రమాదం లేదని వారు వివరించారు. ఎగువ నుంచి పోలవరం ప్రాజక్టులోకి వస్తున్న వరద నీటిని ప్రాజక్ట్ స్పిల్వే గేట్ల నుంచి దిగువకు వదులుతున్నారు. స్పిల్వే ఎగువన 31.790 మీటర్లు, దిగువన 23.170 మీటర్ల నీటిమట్టం నమోదైంది. స్పిల్వే గేట్ల నుంచి 8,14,816 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు చెప్పారు. కాగా గోదావరి వరద పాత పోలవరం వద్ద ఉన్న కడెమ్మ వంతెన వద్ద తగ్గకపోవడంతో వెనకకు ఎగతన్ని నీరు తహశిల్దార్ కార్యాలయానికి వెళ్ళే రహదారికి ఇరువైపులా పంటపొలాలను ముంచెత్తింది. ఇప్పటికీ ఈ వరద నీటిలోనే పంట ఉంది. మరో వైపు గత 15 రోజులుగా నిలిచిపోయిన లాంచీలు పోలవరం నుంచి పురుషోత్తపట్నం కు ఈ రోజు నుంచి నడుపుతున్నారు.