Breaking: నరసాపురం ఎంపీడీవో మృతి.. డెడ్ బాడీ గుర్తింపు

నరసాపురం ఎంపీడీవో వెంకట రమణరావు మృతి చెందారు. ..

Update: 2024-07-23 06:37 GMT

దిశ, వెబ్ డెస్క్: నరసాపురం ఎంపీడీవో వెంకట రమణరావు మృతి చెందారు. ఏలూరు కాలువలో ఆయన మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. ఈ నెల 15న అదృశ్యమైన ఆయన కోసం ఎన్డీఆర్ఎప్ సిబ్బంది, పోలీసులు గాలించారు. 16 నుంచి ఏలూరు కాలువలో గాలించగా మంగళవారం ఉదయం వెంకట రమణరావు మృతదేహం లభ్యమైంది.

విజయవాడ కానూరు మహదేవపురానికి చెందిన వెంకట రమణరావు నరసాపురంలో ఎంపీడీవోగా పని చేశారు. ఈ నెల 10 నుంచి 20 వరకు సెలవులు పెట్టి కానూరు వెళ్లారు. మచిలీపట్నంలో పని ఉందని చెప్పి ఈ నెల 15న ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అప్పటి నుంచి రమణారావు మళ్లీ ఇంటికి తిరిగి వెళ్లలేదు. రమణరావు పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 16న కుటుంబ సభ్యులకు ఫోన్  మెసేజ్ పంపారు. తాను పుట్టిన రోజే చనిపోయే రోజు అని అందరూ జాగ్రత్త అంటూ కుటుంబ సభ్యులకు రమణరావు మెసేజ్ పంపారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు రమణరావు వాహనం మచిలీపట్నంలో ఉన్నట్లు గుర్తించారు. విజయవాడ, మచిలీపట్నంలో గాలించారు. విజయవాడ మధురానగర్ ఏలూరు కాలువ వద్ద ఆయన మొబైల్ ఫోన్ సిగ్నల్ కట్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కాలువలో గాలించారు. చివరకు రమణరావు డెడ్ బాడీని గుర్తించారు. 

Tags:    

Similar News