Nara Lokesh: రెడ్ బుక్ తెరవకముందే ఢిల్లీకి జగన్‌.. మంత్రి లోకేష్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డిపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-07-26 09:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డిపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద లోకేష్ మాట్లాడారు. జగన్ చెప్పే అసత్యాలను అసెంబ్లీకి వచ్చి చెబితే అర్థమయ్యేలా తాము వాస్తవాలను వివరిస్తామని అన్నారు. వైసీపీ నేతల్లా కూటమి ప్రభుత్వంలోని నేతలు ఎవరూ బూతులు తిట్టరు అని హామీ ఇచ్చారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన 11 సీట్లకే ఇప్పవరకూ ఐదు ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వంపై విమర్శలు చేశారని ఎద్దేవా చేశారు.

అధికారంలో ఉన్న ఐదేళ్లలో కేవలం రెండే రెండు ప్రెస్‌మీట్‌లు పెట్టిన జగన్.. అధికారం కోల్పోగానే ఐదు పెట్టిన విషయాన్ని అందరూ గమనిస్తున్నారని తెలిపారు. తన వద్ద ఉన్న రెడ్ బుక్ తెరవకముందే జగన్ ఢిల్లీ వరకూ వెళ్లి గగ్గోలు పెడుతున్నారని అన్నారు. తన దగ్గర రెడ్ బుక్ ఉందని తానే స్వయంగా 90 బహిరంగ సభల్లో చెప్పానని మరోసారి లోకేష్ గుర్తుచేశారు. తప్పు చేసిన వారి పేర్లు రెడ్ బుక్‌లో చేర్చామని.. చట్ట ప్రకారం శిక్షిస్తామని చేసిన ప్రకటనకు ఇంకా కట్టుబడి ఉన్నానని కీలక వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News