AP news: టీడీపీలోకి మకాం మార్చనున్న మాగుంట..వైసీపీపై ప్రభావం చూపనుందా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.

Update: 2024-02-23 10:37 GMT

దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రాజకీయ నాయకులు గోడ మీద పిల్లిలా ఎప్పుడు ఎటువైపు దూకుతారో తెలియడం లేదు. ఈ క్షణం ఈ పార్టీపై ప్రశంసల జల్లు కురిపించిన వాళ్ళు.. మరుక్షణం మరో పార్టీకి జై కొడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో మార్పులు చేర్పుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం అందరికి తెలిసిందే.

దీనితో సీటు దక్కని బదిలీలు నచ్చని సిట్టింగ్ లు ఎందరో వైసీపీకి గుడ్ బై చెప్పేసారు. ఇక తాజాగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సైతం టీడీపీ తీర్ధం పుచ్చుకోవడానికి తయారైయ్యారు అనే వార్తలు గుప్పు మంటున్నాయి. నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లు అంతో ఇంతో వాస్తవం లేనిదే వార్త ప్రబలదు అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన సీఎం జగన్ పర్యటనకు దూరంగా ఉండడం అటు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇక సంబంధితవర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం ఈనెల చివరిలో లేదా మార్చి మొదటి వారంలో ఆయన టీడీపీ గూటికి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. అలానే తన కొడుకు రాఘవ రెడ్డిని కూడా రానున్న ఎన్నికల్లో నిలబెట్టనున్నారని.. టీడీపీ అభ్యర్థిగా ఒంగోలు నుంచి ఎన్నికల బరిలోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఒంగోలులో ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది.

ఇక అక్కడ తన మాటే శాసనంగా భావించే అభిమానులు కూడా ఆయనకు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి ప్రజాదరణ పొందిన వ్యక్తి టీడీపీ లోకి వస్తే ఒంగోలు పార్లమెంట్ సగ్మెంట్ లో టీడీపీ బలం పెరుగుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే మాగుంట రాకతో టీడీపీకి ఎంత ప్రయోజనం చేకూరనుందో అంతే ప్రతికూల ప్రభావం వైసీపీ పై చూపించనుంది.

ప్రస్తుతం సిద్ధం సభతో రానున్న ఎన్నికలకు తాను సంసిద్ధంగా ఉన్నట్లు సీఎం జగన్ చెప్తున్నారు. కానీ ప్రజలు జగన్ పాలనతో విసుగు చెంది ఉన్నారని.. ముఖ్యంగా నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్న యువతలో జగన్ కు వ్యతిరేకత తారాస్థాయిలో ఉందని కొన్ని సర్వేల ఆధారంగా అందిన సమాచారం. ఇలాంటి నేపథ్యంలో ప్రజాదరణ ఉన్న మాగుంట వైసీపీని వీడడం పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉంది.

ఒకరి పుట్టిన రోజు మరొకరికి చావు రోజు అని మాగుంట రాక టీడీపీకి ఒంగోలు సిగ్మెంట్లో విజయాన్ని అందించే అవకాశం ఉండగా.. వైసీపీకి ఓటమిని చేకూర్చే ఆస్కారం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  టీడీపీలో చేరే నాటికి నియోజకవర్గం పరిధిలో లోటుపాట్లు గుర్తించి, టీడీపీలో చేరిన తరువాత అధిష్టానం సహకారంతో వాటిని చక్కదిద్దుకునేందుకు మాగుంట యోచిస్తున్నట్లు.. ఇక ఇప్పటికే అందుకు సంబంధించిన చర్యలు కూడా తీసుకుంటునట్లు సమాచారం. 



Tags:    

Similar News