దశాబ్దాలుగా ఉన్న నేతలకు ఝలక్.. జగన్ వ్యూహం ఇదేనా..!

ఈ రాజకీయాలు ఇలా ఉండకూడదు. మార్పు రావాలి. నాయకుడు అవసరం లేని సమాజం దిశగా అడుగులు పడాలి..

Update: 2024-02-03 02:23 GMT

“ఈ రాజకీయాలు ఇలా ఉండకూడదు. మార్పు రావాలి. నాయకుడు అవసరం లేని సమాజం దిశగా అడుగులు పడాలి..” అంటూ గత ఎన్నికల ముందు వైసీపీ అధినేతగా వైఎస్​ జగన్​ గంభీరంగా చెప్పారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్​చార్జుల మార్పు చేర్పులను నిశితంగా పరిశీలిస్తే.. తరాల తరబడి నియోజకవర్గాలను శాసిస్తున్న రాజకీయ కుటుంబాల ఆధిపత్యాన్ని పటాపంచలు చేసేట్లు సీఎం జగన్​ చర్యలున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హైర్​ అండ్​ ఫైర్​ మాదిరిగా కార్పొరేట్​ స్టైల్​ రాజకీయాలకు శ్రీకారం చుట్టినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రిని నేరుగా ప్రజలు ఎన్నుకునే అధ్యక్ష తరహా పద్దతికి ఇవి తొలి అడుగులని మరికొందరు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

దిశ, ఏపీ బ్యూరో : ఎప్పటినుంచో నియోజకవర్గాల్లో పాతుకుపోయిన నేతలను వైసీపీ అధిష్టానం ఎడాపెడా మార్చేస్తోంది. ఇప్పటిదాకా ఆరు విడతలుగా 77 నియోజకవర్గాల్లో ఇన్​చార్జుల మార్పుచేర్పులు చేపట్టారు. ప్రభుత్వ వ్యతిరేకతను పూర్తిగా ఎమ్మెల్యేలపైకి తోసెయ్యడం ద్వారా కొంత సానుకూలతను పొందేందుకు అధిష్టానం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నదని భావించారు. దీని వెనుక సీఎం జగన్​ ఆలోచనలు వేరుగా ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఎమ్మెల్యేలను ఐదేళ్లకోసారి మార్చెయ్యడం ద్వారా నియోజకవర్గాల్లో వాళ్ల ఆధిపత్యాన్ని జీరో స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యం కనిపిస్తోంది. ఎన్నికల్లో ఎవర్ని నిలిపినా ప్రజలు అధినాయకుడ్ని చూసి ఓటేసే పద్దతిని తీసుకురావాలనేది జగన్​ ఆలోచనల సారాంశంగా చెబుతున్నారు.

తొలి వేటు వారిపైనే..

మార్పు చేర్పులకు సంబంధించి తొలుత ఎస్సీ, ఎస్టీ, బీసీ నియోజకవర్గాల నుంచి మొదలు పెట్టారు. ఆయా నేతల నుంచి తిరుగుబాట్లు పెద్దగా ఉండకపోవచ్చని భావించారు. ఈ వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇన్​చార్జులు ఆయా నియోజకవర్గాలకు స్థానికులు కాదు. బయట నుంచి వచ్చి పోటీ చేసిన నేతలే ఎక్కువగా ఉన్నారు. అందువల్ల వీళ్ల నుంచి ఎదురుదాడి అంతగా ఉండకపోవచ్చని భావించారు. ఆ తర్వాత తరాల తరబడి రాజకీయ కుటుంబాలు ఏలుతున్న నియోజకవర్గాల్లోనూ కొన్నింటిని మార్పు చేశారు. అక్కడ తిరుగుబాటు వస్తే కొత్త వాళ్లకు అవకాశమిస్తున్నారు.

జగన్ వ్యూహం వెనుక..

ఈ నిర్ణయాల వల్ల ఎక్కడైనా నష్టం ఎక్కువగా ఉంటుందనుకున్న చోట పార్టీ వెనకడుగు వేస్తోంది. మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో కొందర్ని జంబ్లింగ్​ చేయడం, మరికొన్ని చోట్ల కొత్త వాళ్లకు అవకాశమివ్వడం ద్వారా ఏ ఒక్క నాయకుడు వాళ్ల నియోజకవర్గంలో తనదైన వర్గం ఏర్పాటు చేసుకోకుండా నిరోధించాలనేదే సీఎం జగన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

కేంద్రంలో బీజేపీ గెలిస్తే..

ఈ దఫా కేంద్రంలో బీజేపీ అధికారానికి వస్తే అధ్యక్ష తరహా పాలన వైపు అడుగులు వేసే అవకాశమున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ముఖ్యమంత్రిని ప్రజలే నేరుగా ఎన్నుకునేట్లు అవసరమైతే రాజ్యాంగానికి సవరణలు చేయొచ్చు. వీటన్నింటి దృష్ట్యా సీఎం జగన్​ ఇలాంటి కార్పొరేట్​ స్టైల్​ రాజకీయాలకు శ్రీకారం చుట్టినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

Tags:    

Similar News