Jagan: మాజీ సీఎం జగన్ కాన్వాయ్ ను అడ్డుకున్న పోలీసులు!

వినుకొండ వెళుతున్న ఏపీ మాజీ సీఎం జగన్ కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు.

Update: 2024-07-19 06:47 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: వినుకొండ వెళుతున్న ఏపీ మాజీ సీఎం జగన్ కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయనతో పాటు బయలు దేరిన వైసీపీ నాయకుల వాహనాలను నిలిపివేశారు. బుధవారం అర్ధరాత్రి నడిరోడ్డుపై హత్యకు గురైన వైసీపీ కార్యకర్త షేక్ రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ వినుకొండకు బయలుదేరారు. వర్షం కారణంగా రోడ్డు మార్గం ద్వారా బయలు దేరడంతో ఆయన వెంట వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సహా ఇతర నాయకులు పదుల సంఖ్యలో కాన్వాయ్ తో బయలుదేరారు. అయితే వీరందరినీ పోలీసులు ఎక్కడికక్కడ రోడ్లపైనే నిలిపివేశారు.

వినుకొండలో 144 సెక్షన్ అమలులో ఉండటంతో ఎలాంటి ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి లేదు. దీంతో మాజీ సీఎం కాన్వాయ్ ను పోలీసులు ఆపారు. ఆయనతో పాటు వినుకొండకు బయలుదేరిన వైసీపీ నాయకుల వాహానాలను తాడేపల్లి, మంగళగిరి, గుంటూరుతో సహా పలు ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ సెక్యూరిటీ నడుమ జగన్ మోహన్ రెడ్డిని మాత్రమే అనుమతించడంతో.. ఆయన మరొక వాహానంలో బయలుదేరారు. దీనిపై గుంటూరు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి స్పందిస్తూ.. వినుకొండలో 144 సెక్షన్ అమలులో ఉందని, ఎలాంటి ర్యాలీలకు, ప్రదర్శనలకు అనుమతి లేదని తెలిపారు.

వైసీపీ నేత జగన్ వచ్చి పరామర్శించవచ్చు. కానీ జనసమీకరణకు, ప్రదర్శనకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రావద్దని ఐజీ పేర్కొన్నారు. కాగా పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో ముండ్లమూరు బస్టాండ్ వద్ద నడిరోడ్డుపై షేక్ రషీద్ అనే యువకుడిని, షేక్ జిలానీ అనే వ్యక్తి అందరూ చూస్తుండగానే దారుణంగా హత్య చేశాడు. అయితే వీరిద్దరూ గతంలో మిత్రులేనని, ఖాన్ ముఠాలో సభ్యులుగా ఉన్నారని పోలీసులు విచారణలో వెల్లడైంది.

Tags:    

Similar News