షెల్ కంపెనీల సృష్టికర్త జగన్‌ రెడ్డి : ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి నిరసన

ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి.

Update: 2023-09-21 05:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఫైర్ ఆఫీసు నుంచి పాదయాత్రగా అసెంబ్లీకి బయలుదేరారు. అయితే ఈ ర్యాలీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యేలు సైతం పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సైతం పాల్గొన్నారు. టీడీపీ శాసన సభపక్షం నిరసనలో ప్లకార్డులు ప్రదర్శించారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి షెల్ కంపెనీల సృష్టికర్త వైఎస్ జగన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మిగిలిన ఇద్దరు బహిష్కృత ఎమ్మెల్యేలు ర్యాలీలో పాల్గొన్నప్పటికీ ఉండవల్లి శ్రీదేవి మాత్రం ఫ్లెక్సీలు ప్రదర్శించడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు టీడీపీ శాసన సభాపక్షం ‘చంద్రబాబుపై కక్ష - యువత భవితకు శిక్ష’ అంటూ ఎమ్మెల్యేలు ప్లకార్డుల ప్రదర్శించారు. చంద్రబాబుపై అక్రమ కేసు ఎత్తేసి వెంటనే విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. లేదంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అనంతరం తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్రగా వెళ్లారు. ఈ ర్యాలీలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ, నిమ్మకాయల చినరాజప్ప, నిమ్మల రామానాయుడు, పంచుమర్తి అనురాధతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Tags:    

Similar News