మహిళా కౌన్సిలర్ భర్తకు ఫోన్ చేసి ఇంత దారుణమా.. వైసీపీ ఎమ్మెల్యే ఆడియో వైరల్

మహిళా కౌన్సిలర్ భర్తకు ఫోన్ చేసి వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి...

Update: 2024-02-01 13:44 GMT

దిశ, వెబ్ డెస్క్: పార్టీ ఇంచార్జుల మార్పులతో వైసీపీ నేతల్లో అసంతృప్తి జ్వాల రగులుతున్నాయి. దీంతో పార్టీ మారే ఆలోచనలు చేస్తున్నారు. అయితే వారికి వైసీపీ నేతల నుంచి బెదిరింపులు మొదలయ్యాయి. డబ్బులు కట్టి పార్టీని వీడాలని ఫోన్ చేసి మరీ భయపెడుతున్నారు. సాయంత్రంకల్లా అటో, ఇటో తేల్చుకోవాలని, లేదంటే ఊరికునేది లేదని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఈ బెదిరింపులకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ఆడియో ఎవరిదో కాదు గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డిది.

కాగా నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయులకు సీఎం జగన్ సీటు నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే శ్రీకృష్ణదేవరాయులతో పాటు ఆయన అనుచరులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ రాజీనామా చేశారు. దీంతో ఆయన అనుచరులు సైతం పార్టీ వీడేందుకు  సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి నుంచి బెదిరింపు కాల్స్ వెళ్తున్నాయి. శ్రీకృష్ణదేవరాయుల అనుచరులకు ఫోన్ చేసి ‘ఉంటే అటో ఇటో ఉండాలి‘ అని, కానీ పార్టీ నుంచి బయటకు వెళ్తే రూ. 9 లక్షలు కట్టాలని డిమాండ్ చేశారు. గురుజాల 12వ వార్డు కౌన్సిలర్ భర్త నీలంరాజుకు కాసు మహేశ్ మాట్లాడిన ఆడియో సంచలనంగా మారింది. పార్టీలో ఉండి.. ఇన్ని రోజులు పార్టీ డబ్బులు ఖర్చు పెట్టి వెళ్లిపోతామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అటూ, ఇటూ ఉంటానని కుప్పిగంతులు వేస్తే అసలు సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిపక్ష పార్టీల నుంచి కాసు మహేశ్ రెడ్డిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags:    

Similar News