దిశ, వెబ్ డెస్క్ : విజయవాడ(Vijayawada) నగరంలోని అజిత్ సింగ్ నగర్ మళ్ళీ వరద గుప్పిట్లోకి వెళ్తోంది. బుడమేరుకు ప్రవాహం పెరుగుతుండటంతో నిన్నటి కంటే ఈరోజు సింగ్ నగర్లో వరద నీరు మరింత పెరిగింది. రాజేశ్వరిపేట, రామకృష్ణాపురంలలో కూడా వరద నీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు ఇళ్ళు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. మరోవైపు ప్రభుత్వ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆహారపోట్లాలు, వాటర్ బాటిల్స్ పంపిణీ యధావిధిగా జరుగుతోంది. అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్మికులు రసాయనాలు పిచికారి చేస్తున్నారు. ఆరోగ్యకార్యకర్తలు, ఆయుష్ సిబ్బంది ఇంటింటికి తిరిగి మందులు పంపిణీ చేస్తున్నారు. సంచార రైతు బజార్లు ఏర్పాటు చేసి రూ.5 కే కేజీ చొప్పున కూరగాయలు విక్రయిస్తున్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Nayudu) బుడమేరుకు గండి పడిన ప్రాంతాన్ని, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు.