శ్రీవారి భక్తులకు అలర్ట్.. మార్చి 1 నుంచి ఫేషియల్ రికగ్నిషన్

తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్. తిరుమల తిరుపతి దేవస్థానం మార్చి 1 నుంచి భక్తులకు ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించనుంది..

Update: 2023-02-25 09:57 GMT
  • తిరుమలలో భక్తులకు ఫేషియల్ రికగ్నిషన్
  • మార్చ్ 1 నుంచి కఠినంగా అమలు
  • ఇక దళారీల ఆటలకు పుల్ స్టాప్

దిశ, తిరుపతి: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్. తిరుమల తిరుపతి దేవస్థానం మార్చి 1 నుంచి భక్తులకు ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించనుంది. దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి తిరుపతి వచ్చే శ్రీవారి భక్తులకు టోకెన్లు లేకుండా దర్శనం కల్పించడం, వసతి కేటాయించడంలో పారదర్శకత కోసం టీటీడీ ఈ టెక్నాలజీ ఉపయోగించుకోనుంది. సర్వదర్శనం కాంప్లెక్స్‌లో భక్తులు ఎక్కువ టోకెన్స్ తీసుకోకుండా అడ్డుకట్ట వేసేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని టీటీడీ భావిస్తోంది. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని సర్వదర్శనం కౌంటర్, టోకెన్‌లెస్ దర్శనం, లడ్డూల పంపిణీ, వసతి అలాట్‌మెంట్, కాషన్ డిపాజిట్ రీఫండ్, ఇతర ప్రాంతాల్లో టీటీడీ ఉపయోగించనుంది.

అసలు ఈ టెక్నాలజీ ఎలా పని చేస్తుందంటే...

టీటీడీ మార్చి 1 నుంచి వైకుంఠం 2, ఏఎంఎస్ సిస్టమ్స్‌లో ప్రయోగాత్మకంగా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ప్రారంభించనుంది. దర్శనం కోసం నమోదు చేసుకునే సమయంలో ఎంట్రీ పాయింట్ దగ్గర ప్రతీ భక్తుడిని ఫోటో తీస్తారు. అప్పటికే టీటీడీ దగ్గర ఉన్న డేటా, బ్యాంకులో ఉన్న డేటాతో భక్తుడి ముఖాన్ని పోల్చి చూస్తారు. తద్వారా టీటీడీ అందిస్తున్న సేవల్ని ఎవరైనా దుర్వినియోగం చేస్తున్నారా, ఎక్కువ టోకెన్లు తీసుకుంటున్నారా? అని పరిశీలిస్తారు. మొదటిసారి భక్తుడి ఫేస్‌ను గుర్తించిన తర్వాత ఆ డేటా టీటీడీ దగ్గర ఉంటుంది. ఒకవేళ అదే భక్తుడు మళ్లీ టోకెన్ కోసం వస్తే పాత డేటా ద్వారా సులువుగా గుర్తించవచ్చు.

శ్రీవారి దర్శనం కోసం రూ.300 టికెట్ పొందండి ఇలా

తిరుమలలో 300 రూపాయలు టికెట్ తీసుకున్న భక్తుడే ఆలయంలోకి వెళ్తున్నాడా అని కూడా పరిశీలిస్తారు. ఆలయంలోకి వెళ్లేముందు కెమెరా ముందు నిలబడాల్సి ఉంటుంది. అప్పుడు ఫోటో క్లిక్ చేస్తారు. అప్పటికే డేటా బ్యాంకులో ఉన్న ఫోటోతో, ఆ టికెట్ మ్యాచ్ అయితే ఆలయంలోకి వెళ్లడానికి అనుమతిస్తారు. లేకపోతే టీటీడీ చర్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో ఆధార్ కార్డుల్ని చెక్ చేసేవారు వివరాలను మ్యాన్యువల్‌గా ఎంటర్ చేసేవారు. ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించబోతున్నారు.

ఈ టెక్నాలజీని పూర్తి స్థాయిలో అమలు చేశారంటే...తిరుమలకు వచ్చే ప్రతీ భక్తుడిపై డిజిటల్ నిఘా ఉంటుంది. సుమారు 3,000 కెమెరాలు భక్తుల్ని గమనిస్తుంటాయి. ఒక్కసారి ఓ భక్తుడు ఎన్‌రోల్‌మెంట్ చేసుకున్నాడంటే, ఎంట్రీ పాయింట్ దగ్గర, దర్శనానికి వెళ్లేప్పుడు, లడ్డూ ప్రసాదం తీసుకునే దగ్గర కెమెరాలు గమనిస్తూనే ఉంటాయి. లడ్డూ కౌంటర్లను నిర్వహించే ఔట్‌సోర్సింగ్ సిబ్బంది లడ్డూల పంపిణీ ప్రక్రియను దుర్వినియోగం చేయకుండా అడ్డుకట్ట పడుతుంది. భక్తులకు వసతి సౌకర్యం కూడా ఫేషియల్ రికగ్నిషన్‌తో మ్యాచ్ అయిన తర్వాతే ఇస్తారు.

Tags:    

Similar News