మంచినీళ్లు అనుకుని యాసిడ్ తాగిన చిన్నారి మృతి
మంచినీళ్లు అనుకుని ఓ 18నెలల చిన్నారి యాసిడ్ తాగడంతో ప్రాణాలు కొల్పోయిన విషాద ఘటన విజయవాడలో చోటుచేసుకుంది.
దిశ, వెబ్ డెస్క్ : మంచినీళ్లు అనుకుని ఓ 18నెలల చిన్నారి యాసిడ్ తాగడంతో ప్రాణాలు కొల్పోయిన విషాద ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం టెంపుల్ కాలనీకి చెందిన మహ్మద్ అబ్బాస్ ఈ నెల 19న తన భార్య, ఇద్దరు పిల్లలు అయేషా, ఆఫియాలతో కలిసి మచిలీపట్నం నుంచి విజయవాడలోని అశోక్నగర్లోని అత్తింటికి వచ్చాడు. చిన్నారి ఆఫియా అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆడుకుంటూ వాష్రూమ్లోకి వెళ్లింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించలేదు. అక్కడ బాత్ రూమ్ లో ఉన్న యాసిడ్ బాటిల్ ను చూసిన చిన్నారి అందులో ఉన్నవి మంచినీళ్లు అనుకుని మూత తీసి తాగింది. కొద్దిసేపటికి చిన్నారి వాంతులు చేసుకోగా.. గమనించిన తండ్రి అబ్బాస్ వెంటనే చిన్నారిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. చికిత్సపొందుతూ చిన్నారి అఫియా ప్రాణాలు కోల్పోయింది. కూతురు మరణంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అయ్యారు. ఈ ఘటనపై విజయవాడ పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.