విద్యుత్ వాహన చార్జింగ్ కేంద్రాలకు ఏపీ సర్కార్ రాయితీ

విద్యుత్ వాహన చార్జింగ్ కేంద్రాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయితీలు అందించబోతోంది.

Update: 2024-10-03 07:32 GMT

దిశ, వెబ్ డెస్క్ : విద్యుత్ వాహన చార్జింగ్ కేంద్రాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయితీలు అందించబోతోంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనుంది. రాష్ట్రంలో ఏర్పాటు చేసే మొదటి 500 ప్రైవేట్ ఛార్జింగ్‌ కేంద్రాలకు మాత్రమే రాయితీలు వర్తింపజేయనుంది.ఒక్కో కేంద్రం ఏర్పాటుకైన ఖర్చులో 25 శాతం గరిష్ఠంగా రూ.3 లక్షల చొప్పున రాయితీ ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని ఐదేళ్లలో చెల్లిస్తుంది. అందుబాటులో ఉన్నచోట ప్రభుత్వ/ ప్రభుత్వ రంగ సంస్థల భూములను లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. ఛార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను నోడల్‌ ఏజెన్సీగా నూతన పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ (నెడ్‌క్యాప్‌) పర్యవేక్షించనుంది. రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లు, జిల్లా కేంద్రాల్లో మొదట ఏర్పాటు చేసే 150 ఛార్జింగ్‌ కేంద్రాలకే ప్రభుత్వం నిర్దేశించిన రాయితీలు అందించాలని నిర్ణయించింది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో సాధ్యమైనన్ని ఎక్కువ కేంద్రాలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల స్థలాల్లో ఏర్పాటు చేసిన ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లలో వినియోగించిన విద్యుత్‌పై నిర్వాహకుల నుంచి యూనిట్‌కు రూపాయి చొప్పున లీజుగా వసూలు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. డిమాండ్‌ రెస్పాన్స్‌ మేనేజ్‌మెంట్‌ ఆధారంగా స్మార్ట్‌ ఈవీ ఛార్జింగ్‌ కేంద్రాల నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తోంది. టెండర్ల ప్రక్రియ ద్వారా ఛార్జింగ్‌ పాయింట్‌ ఆపరేటర్లను నెడ్‌క్యాప్‌ ఎంపిక చేసేలా ప్రతిపాదించింది. అవసరమైన ఇన్‌పుట్‌ విద్యుత్‌ను ఓపెన్‌ యాక్సెస్‌, గ్రీన్‌ అమ్మోనియా జనరేటర్‌ నుంచి తీసుకునే వెసులుబాటును నిర్వాహకులకే కల్పించాలని నిర్దేశించింది.

అలాగే జాతీయ రహదారిపై 25 కి.మీ.లకు ఓ ఛార్జింగ్‌ కేంద్రాన్ని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదట వచ్చిన 150 కేంద్రాల ప్రతిపాదనలకే రాయితీ వర్తిస్తుంది. అవసరమైన స్థలాన్ని నిర్వాహకులే సమకూర్చుకోవాలి. ప్రైవేటు, వాణిజ్య భవనాల్లో వందకు పైగా కార్ల పార్కింగ్‌కు అవకాశం (కనీసం 5వేల చ.మీ.స్థలం) ఉన్న వాటికి, అపార్టుమెంట్లు, సొసైటీలకు (500 ప్లాట్లు, ఇళ్లు) కలిపి రాయితీ ఇవ్వాలని భావిస్తోంది. ఇందులోనూ మొదటి 50 ఛార్జింగ్‌ కేంద్రాల ప్రతిపాదనలకే ఇది వర్తిస్తుంది. చార్జింగ్ కేంద్రాలకు రాయితీలతో పాటు ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేలా తక్కువ ధరకే విద్యుత్‌ అందించేలా ప్రతిపాదన సిద్ధం చేస్తోంది. ప్రస్తుత టారిఫ్‌ ప్రకారం గంటసేపు ఛార్జింగ్‌కు సగటున రూ.25 వరకు ఖర్చవుతోందని, దీన్ని కనీసం రూ.15కు తగ్గించాలన్న ఛార్జింగ్‌ కేంద్రాల నిర్వాహకుల ప్రతిపాదనలపై ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేస్తోంది. 


Similar News