టాటా అంటే భారతదేశపు ఉనికి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

రతన్ టాటా మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. టాటా అంటే భారతదేశపు ఉనికి అనేలా.. సంస్థ గుర్తింపును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని కితాబిచ్చారు.

Update: 2024-10-10 04:30 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా (86) అనారోగ్యంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణం పట్ల సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రతన్ టాటా మృతిపట్ల సంతాపం ప్రకటించారు. టాటా అంటే..భారతదేశపు ఉనికి అని చెప్పేలా ఆయన సామ్రాజ్యాన్ని అంతర్జాతీయ స్థాయికి విస్తరింపజేశారని కొనియాడారు.

"ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గ్రూప్ చైర్మన్, పద్మ విభూషణ్ శ్రీ రతన్ నోవల్ టాటా గారి మరణం భారతదేశానికి తీరని లోటు.. భారత పారిశ్రామిక రంగానికి కాదు, ప్రపంచ పారిశ్రామిక రంగానికి రతన్ టాటా గారు ఆదర్శంగా నిలిచారు. ఆయన నేతృత్వంలో ఉప్పు నుండి మొదలుకొని, విమానయాన రంగంలో వరకు భారత దేశపు అణువణువులో టాటా అనే పేరు ప్రతిధ్వనించేలా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఆయన హయాంలో టాటా అంటే భారతదేశపు ఉనికి గా అంతర్జాతీయ సమాజం ముందు నిలబెట్టారు. ఆయన. కేవలం పారిశ్రామిక వేత్తగా కాకుండా గొప్ప మానవతావాదిగా ఆయన సమాజానికి చేసిన సేవలు అనిర్వచనీయం. ఈ బాధాకరమైన సమయంలో తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, టాటా గ్రూప్ సంస్థల కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రతన్ టాటా అనే పేరు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది, ప్రతీ తరానికి ఆదర్శప్రాయంగా నిలచిన మహోన్నత వ్యక్తికి అంతిమ వీడ్కోలు తెలియజేస్తున్నాను." అని పవన్ కల్యాణ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. 


Similar News