ముంచుకొస్తున్న మరో ముప్పు.. ఏపీకి తుపాన్ హెచ్చరిక.. తెలంగాణలో?

అక్టోబర్ 22న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని, దాని ప్రభావంతో ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది.

Update: 2024-10-18 06:12 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీకి ఒక గండం తప్పిందని అనుకునే లోపే.. మరో ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ బాంబ్ పేల్చింది. ఈ నెల 22 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని, అది తుపానుగా మారే అవకాశాలున్నాయని తెలిపింది. ప్రస్తుతం ఉత్తర అండమాన్ లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిపింది. అది వాయువ్య దిశగా కదులుతూ 22 నాటికి అల్పపీడనంగా బలపడనున్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. అలాగే తెలంగాణలో కూడా జోరువానలు కురుస్తాయని, హైదరాబాద్ లో మోస్తరు వర్షం పడే అవకాశాలున్నాయని వివరించింది. ఈ నెల 21వ తేదీనుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణ జిల్లాలకు అలర్ట్

తెలంగాణ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాగ్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు భారీ వర్షసూచన చేసింది. వర్షాలతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. 


Similar News