AP:జీడిపల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్

హంద్రీనీవా నుంచి జిల్లాకు అదనపు నీటిని తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.

Update: 2024-09-22 15:25 GMT

 దిశ ప్రతినిధి, అనంతపురం:హంద్రీనీవా నుంచి జిల్లాకు అదనపు నీటిని తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ఆదివారం బెలుగుప్ప మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు నీటిని అందించే ప్రధాన కాలువగా ఉన్న హంద్రీనీవా కాలవ పై రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన చేపట్టడం జరిగిందన్నారు. కర్నూలు జిల్లాలోని మల్యాల పంప్ హౌస్ పరిశీలించిన తర్వాత జీడిపల్లి జలాశయాన్ని పరిశీలిస్తారన్నారు. హంద్రీనీవా లో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆరు పంపులు పనిచేసేలా చేసామని, ఇప్పుడు 12 పంపులు పనిచేసే అదనంగా జిల్లాకు నీటిని తీసుకువచ్చే ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అందులో భాగంగా క్షేత్రస్థాయిలో పర్యటన చేసి అవగాహన పెంచుకునే దిశగా జల వనరుల శాఖ మంత్రి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, క్షేత్రస్థాయిలో పర్యటించి అనంతరం జిల్లా కేంద్రంలో అధికారులతో విస్తృత సమీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు.

జిల్లాకు ఏ రకంగా నీటిని అందించాలి, సత్వరంగా అన్ని ప్రాజెక్టులు ఏ రకంగా పూర్తి చేయాలి అనే దానిపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారమే మంత్రి పర్యటన చేయడం జరుగుతుందన్నారు. ప్రధానంగా ఉరవకొండ నియోజకవర్గానికి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇరిగేషన్ మంత్రిని పర్యటనకు తీసుకురావడం జరిగిందని, 2014లో కూడా జల వనరుల శాఖ మంత్రి దేవనేని ఉమామహేశ్వరరావు పర్యటనకు తీసుకురావడం జరిగిందని, ఒక పంపు నడిచే దగ్గర నుంచి 6 పంపులు నడిచేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటికే హంద్రీనీవా లో ఆరు పంపులు మాత్రమే నడుస్తున్నాయని, గత ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం మొద్దు నిద్రపోయిందని, ఒక కిలోమీటర్ కాలువను కూడా తవ్విన పాపాన పోలేదన్నారు. తాము మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే జల వనరుల శాఖ మంత్రిని జీడిపల్లి జలాశయాన్ని పరిశీలించాలని ఆహ్వానించడం జరిగిందని, మంత్రి పర్యటన జిల్లాకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకట నాయుడు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


Similar News