Uttar Pradesh: ఒకే కుటుంబంలో ఐదుగురి దారుణ హత్య..
భూవివాదంతో ఉత్తరప్రదేశ్లోని దేవరియా జిల్లాలో దారుణ హత్యలు జరిగాయి.
లక్నో : భూవివాదంతో ఉత్తరప్రదేశ్లోని దేవరియా జిల్లాలో దారుణ హత్యలు జరిగాయి. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మర్డర్ కు గురయ్యారు. రుద్రపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతేపూర్ గ్రామ పంచాయతీ లెధాన్ టోలె గ్రామంలో సత్యప్రకాశ్ దూబే కుటుంబం నివసిస్తోంది. సత్యప్రకాశ్ కు.. అభయ్పురా టోలె గ్రామానికి చెందిన మాజీ జిల్లా పంచాయతీ సభ్యడు ప్రేమ్చంద్ మధ్య గత కొంతకాలంగా భూవివాదం నడుస్తోంది. ఈక్రమంలో సోమవారం ఉదయం ప్రేమ్చంద్ హత్యకు గురయ్యాడు.
ఈ పని సత్యప్రకాశ్ చేయించి ఉండొచ్చని అనుమానంతో ఊగిపోయిన కొందరు దుండగులు.. అతడి ఇంటిపై దాడికి దిగారు. తొలుత సత్యప్రకాశ్ ను, అనంతరం అతడి భార్య, ఇద్దరు పిల్లలు సహా మరో వ్యక్తిని మర్డర్ చేశారు. ఈ దాడిలో మరో ముగ్గురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఈ ఘటనపై స్పందించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఈ ఘటనకు కారకులైన వారిని వదిపెట్టబోమని ప్రకటించారు.