సూర్యాపేటలో మృతదేహాల కలకలం.. ఆ ఇద్దరు ఎవరు..?

సూర్యాపేట జిల్లా కేంద్రంలో రెండు మృతదేహాలు కలలకం సృష్టిస్తున్నాయి.

Update: 2024-08-21 07:30 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలో రెండు మృతదేహాలు కలలకం సృష్టిస్తున్నాయి. ఉదయం నుంచి ఆ గుర్తు తెలియని డెడ్ బాడీలను గుర్తించేందుకు పట్టణ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఓ వ్యక్తి మృతదేహం సద్దల చెరువు ప్రాంతంలో లభించగా.. మరో వ్యక్తి మృతదేహం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మార్చురీలో ఉన్నది. ప్రాథమిక సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

అంజనాపురి కాలనీలోని ఐఎంఐ ఫంక్షన్ హాల్‌కు ఎదురుగా సద్దల చెరువులో సుమారు 60 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది. అతడి నోటి నుంచి నురగలు వస్తుండటంలో పురుగుల మందు తాగి చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న సూర్యాపేట వన్ టౌన్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే మృతుడు ఎవరనేది తెలియరాలేదు. అతడి ఆచూకీ కోసం వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712686005 నంబర్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు.

మరో మృతదేహం గవర్నమెంట్ ఆస్పత్రిలో ఉన్నది. గుర్తు తెలియని వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి వయసు సుమారు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలిసిన వారు సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లోగానీ లేదా 8712686095 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. కాగా, ఒకే రోజు రెండు గుర్తు తెలియని మృతదేహాలు వెలుగు చూడటం పట్టణంలో కలకలం సృష్టిస్తోంది. 


Similar News