స్మార్ట్ సిటీలో యువకుడు దారుణ హత్య
నిజామాబాద్ నగరంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది.
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది. నగరంలోని సీతారాం నగర్ కాలనీకి చెందిన శ్రవణ్ కుమార్ (35) నగర శివారులోని న్యాల్కల్ రోడ్లోని స్మార్ట్ సిటీ వెంచర్లో దారుణ హత్యకు గురయ్యాడు. శ్రవణ్ కుమార్ను తలపై మోది దారుణ హత్యకు పాల్పడ్డారు. అగంతకుల దాడిలో తలపగిలి రక్తం గడ్డకట్టుకుని అక్కడికక్కడే మృతిచెందాడు.
శ్రవణ్ కుమార్ ఖలీల్వాడిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో కాంపౌండర్గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు డ్యూటీలోనే ఉన్నట్టు తెలిసింది. మద్యం మత్తులో ఘర్షణ జరిగినట్టు సమాచారం. సంఘటన స్థలాన్ని నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట రెడ్డి, నార్త్ రూరల్ సీఐ సతీష్, ఐదో టౌన్ ఎస్సై అప్పారావు పరిశీలించారు. శ్రవణ్ కుమార్తో రాత్రి మద్యం సేవించింది ఎవరు..? హత్యకు గల కారణాలను విశ్లేషిస్తున్నారు.