నేడు మిలిటరీ అధికారుల శాంతి చర్చలు

by  |
నేడు మిలిటరీ అధికారుల శాంతి చర్చలు
X

న్యూఢిల్లీ: భారత్, చైనాలకు చెందిన మిలిటరీ అధికారుల మూడో రౌండ్ చర్చలు నేడు జరగనున్నాయి. తూర్పు లడాఖ్‌లో నెలకొన్న ఉద్రిక్తతలను తొలగించడానికి, బలగాల ఉపసంహరణపై లెఫ్టినెంట్ జనరల్ స్థాయి చర్చలు నేడు ఉదయం 10.30 గంటలకు మొదలకాబోతున్నట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఇది వరకు జూన్ 6, 22వ తేదీల్లో చైనా వైపున మోల్డో ఏరియాలో మిలిటరీ శాంతి చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా, భారత భూభాగంలో చుషుల్ సెక్టార్‌లో ఈ సమావేశం జరగనుంది. ఇండియా నుంచి 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా నుంచి టిబెట్ మిలిటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ నేతృత్వంలో ఈ చర్చలు జరగనున్నట్టు సమాచారం. రెండో దశ మిలిటరీ చర్చల్లో సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గడానికి, బలగాల ఉపసంహరణకు ఇరుదేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. జూన్ 6న కుదిరిన అంగీకారాల అమలుపైనా ఈ చర్చలు జరగనున్నట్టు తెలిసింది. మే తొలినాళ్ల నుంచి సరిహద్దులో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఈ నెల 15న చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. సరిహద్దులో శాంతియుత వాతావరణం ఏర్పడటానికి ఇరుదేశాలు మిలిటరీ, దౌత్య మార్గాల్లో సంప్రదింపులు, చర్చలు జరుగుతున్నాయి. కానీ, సరిహద్దులో మాత్రం చైనా సైన్యం వెనక్కిపోవడం మానేసి మరింతగా భారత భూభాగంలోకి చొచ్చుకొస్తున్నది.



Next Story